ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలీనగర్ నుంచి బరిలోకి ఫోక్ సింగర్ మైథిలీ,,,బిహార్‌లో 12 మందితో బీజేపీ రెండో జాబితా

national |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 07:57 PM

బిహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. మొత్తం 12 మందితో రెండో జాబితా విడుదల చేయగా.. వీరిలో ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రాలకు అవకాశం కల్పించింది. సింగర్ మైథిలీ అలీనగర్ నుంచి, ఆనంద్ మిశ్రా బక్సార్ నుంచి పోటీచేయనున్నారు. ఈ జాబితాలోని 12 మందిలో 9 మంది కొత్త ముఖాలు కావడం విశేషం. మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన మైథిలీ ఠాకూర్ ఇటీవల బీజేపీలో చేరారు. యువతలో ఆమెకున్న పాపులారిటీని ఉపయోగించుకోడానికి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మిథిలాంచల్ ప్రాంతంలో కీలకమైన అలీనగర్ స్థానం నుంచి ఆమెను బరిలోకి దించింది.


బీజేపీలో చేరిన సమయంలో అవకాశం వస్తే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని మైథిలీ తన మనసులో మాటను బయటపెట్టారు. గతంలో ఎన్నికల కమిషన్ బిహార్ ‘స్టేట్ ఐకాన్’గా మైథిలీ నియమితులయ్యారు. బిహార్ సాంస్కృతిక అంబాసిడర్‌గా కూడా ఆమె గుర్తింపు పొందారు. సంప్రదాయ, జానపద సంగీతంలో శిక్షణ పొందిన మైథిలి బిహార్ జానపద సంగీతానికి చేసిన సేవలకుగానూ 2021లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సంగీత నాటక అకాడమీ సత్కరించింది.


కాగా, సింగర్ మైథిలీతో పాటు చాప్రా నుంచి మరో మహిళ ఛోటీ కుమారికి బీజేపీ అవకాశం కల్పించింది. రోస్రా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర కుమార్, హయఘాట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామచంద్ర ప్రసాద్‌కు మళ్లీ టిక్కెట్లు ఇచ్చింది. అయితే, ఛాప్రా ఎమ్మెల్యే సీఎన్ గుప్తా, గోపాల్‌గంజ్ ఎమ్మెల్యే కుసమ దేవిలను పక్కనబెట్టింది.


జానపద గాయని తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న అలీనగర్ నుంచి గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మిశ్రి లాల్ యాదవ్ విజయం సాధించారు. అగియాన్ నుంచి మహేశ్ పాశ్వాన్‌ను బరిలోకి దింపుతోంది.


బీజేపీ రెండో జాబితాలో కొత్తవాళ్లే ఎక్కువగా ఉండటం ప్రశాంత్ కిశోర్ అవలంబిస్తున్న వ్యూహానికి ప్రతిస్పందనగా కనిపిస్తోంది. వివిధ రంగాలు ముఖ్యంగా పదవీ విరమణ చేసినవారికి జన సూరజ్ పార్టీ తరఫున నిలబెట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. బిహార్‌‌లో బీజేపీ పోటీచేస్తున్న 101 స్థానాలకు గాను తాజా జాబితాతో కలిపి ఇప్పటి వరకూ 83 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. 71 మంది అభ్యర్థులతో సోమవారం తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 243 స్థానాలున్న బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa