దీపావళి పండుగ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ, పరిసర నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంత ప్రజలకు సుప్రీం కోర్టు శుభవార్త అందించింది. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని విధించిన బాణాసంచా షేధాన్ని పాక్షికంగా సడలిస్తూ.. గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగానికి అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం.. దీపావళి సంబరాల్లో ప్రజలు గ్రీన్ క్రాకర్స్ను కాల్చుకోవచ్చు. అయితే ఈ అనుమతి కొన్ని కఠినమైన షరతులకు లోబడి మాత్రమే ఉంటుంది.
గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అక్టోబర్ 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానం అనుమతిని ఇచ్చింది. అలాగే గ్రీన్ క్రాకర్స్ను కాల్చుకోవడానికి కూడా సమయ పరిమితిని విధించింది. ప్రజలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచాను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కేవలం క్యూఆర్ కోడ్లు కలిగిన, అనుమతి ఉన్న గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే విక్రయించేలా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయడానికి గాను పోలీసు పెట్రోలింగ్ బృందాలు విస్తృత నిఘా పెట్టాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాకుండా ఈ-కామర్స్ వెబ్సైట్ల (ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల) ద్వారా బాణాసంచా అమ్మకాలను కూడా నిషేధించింది. బాణాసంచా వినియోగంపై పూర్తి నిషేధాన్ని విధిస్తే.. అక్రమ మార్గాల్లో (స్మగ్లింగ్ ద్వారా) ఆ క్రాకర్స్ను తరలించి, విక్రయించే అవకాశాలు పెరిగే ప్రమాదం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే స్మగ్లింగ్ చేసిన బాణాసంచాలు వాడడం వల్ల గ్రీన్ కాకర్స్ వినియోగించిన దానికంటే ఎక్కువ నష్టం వాటిల్లుంతుందని పేర్కొంది. అందుకే ఈ పరిస్థితులను బ్యాలెన్స్ చేసేలా చర్యలు ఉండాలని నిర్ణయించింది.
పర్యావరణానికి హాని కల్గకుండా మితంగా వాడేందుకు మాత్రమే అనుమతిస్తున్నామని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అలాగే కాలుష్య నియంత్రణ సంస్థలు గాలి నాణ్యతా సూచీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఢిల్లీలోని ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉన్నందు బాణాసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు గతంలో తీర్పునిచ్చింది. అయితే వీటిపై పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 వరకు రెండు గంటలపాటు పర్యావరణహితమైన బాణాసంచా కాల్చడానికి అనుమతి ఇవ్వాలని కోరాయి. ఈక్రమంలోనే విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa