ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య పెట్టుబడులు, మౌలిక సౌకర్యాల విషయంలో జరుగుతోన్న మాటల యుద్ధం శుక్రవారం మరో మలుపు తిరిగింది. తాజాగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంట్రీతో ఈ వివాదం మరో స్థాయికి చేరుకుంది. విశాఖ నగరంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రులు నారా లోకేశ్, ప్రియాంక్ ఖర్గేలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. పెట్టుబడిదారులు తమకు నచ్చిన చోట పెట్టుబడులు పెడతారని వ్యాఖ్యానించారు.
బెంగళూరు రావాల్సిన గూగుల్ విశాఖకు తరలిపోవడంపై విమర్శలు చేస్తున్నవారిని (నారా లోకేష్ను) ఉద్దేశిస్తూ ‘యాపిల్ ఇక్కడ పెట్టుబడి పెట్టింది... ఆంధ్రప్రదేశ్లో కాదు’ అని అన్నారు. అలాగే, సామాజిక మాధ్యమాల్లో కర్ణాటకను లక్ష్యంగా చేసుకుని ‘ఉద్దేశపూర్వకంగా’ పోస్టులు పెట్టడంపై కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏపీ ఘాటు పొరుగువారికి తగులుతోందని పరోక్షంగా కర్ణాటకను ఉద్దేశించి లోకేశ్ చేసిన ట్వీట్పై జేడీఎస్ యువనేత నిఖిల్ కుమారస్వామి స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యగా పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. యువతకు ఉద్యోగ కల్పనే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మైసూరులో జరిగిన మెగా జాబ్ ఫెయిర్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు.
నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతకు ఇచ్చే యువ నిధి భృతిని ప్రభుత్వం నిలిపివేసిందన్న బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చారు. యువ నిధి లబ్ధిదారుడు ఉద్యోగం పొందిన తర్వాత మాత్రమే నిలిపివేస్తామని, మాది మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం. కానీ నరేంద్ర మోదీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసి దానిని నెరవేర్చలేకపోయారని సిద్ధూ దుయ్యబట్టారు.
సెప్టెంబరు మధ్యలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త రాజేశ్ యబాజీ నగరంలోని మౌలిక సౌకర్యాలపై సోషల్ మీడియాలో చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేశ్ స్పందించడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఏపీలో గూగుల్ పెట్టుబడులపై కర్ణాటక మంత్రి విమర్శలు, దీనికి లోకేశ్ కౌంటర్తో ఇరు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల రాజకీయం నడుస్తోంది. గూగుల్ డేటా సెంటర్ గురించి ఏపీ గొప్పలు చెప్పుకుంటోందని.. ఏకంగా రూ. 22, 000 కోట్ల భారీ ప్రోత్సాహకాలు ఇచ్చిన విషయం దాచిపెడుతోందని ప్రియాంక్ ఖర్గే విమర్శించారు. దీనిపై లోకేశ్ స్పందించడంతో వివాదం పతాకస్థాయికి చేరుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa