ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడేళ్ల పాటు గ్రీన్ కార్డ్ లాటరీకి నో ఛాన్స్,,,భారతీయులకు అమెరికా మరో షాక్

international |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 09:57 PM

భారతీయ వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే హెచ్1బీ వీసా ఫీజు పెంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రంప్.. తాజాగా ప్రవాస భారతీయులకు మరో షాక్ ఇచ్చారు. అమెరికా డైవర్సిటీ వీసా (DV) లాటరీలో పాల్గొనేందుకు మరో మూడేళ్ల వరకు భారతీయులకు అవకాశం లేదు. అంటే 2028 వరకు భారతీయులు అర్హులు కాదు. దీన్నే గ్రీన్ కార్డ్ లాటరీ అని కూడా అంటారు. 2026 డైవర్సిటీ వీసా ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోకుండా కొన్ని దేశాలను మినహాయించారు. అందులో భారత్‌ను చేర్చారు. కాగా, 2024 వరకు దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రవాస భారతీయులు యూఎస్ గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ ఆ సంఖ్య భారీగానే ఉంది. ట్రంప్ తాజా నిర్ణయంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది


ఎందుకిలా..?


ఇలా చేయడానికి అమెరికా అధికారులు పలు కారణాలు చెబుతున్నారు. గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రాంలో గత 5 సంవత్సరాలల్లో అమెరికాకు తక్కువ వలసలు ఉన్న దేశాల దరఖాస్తు దారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏటా 50,000 మంది కంటే తక్కువ వలస వచ్చే దేశాలకే.. అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, అమెరికాలో అన్ని దేశాలకు చెందిన వలసదారులకు.. అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.


భారత్‌ను ఎందుకు మినహాయించారు?


భారత్ నుంచి గత కొన్నేళ్లుగా వలసలు ఎక్కువగా ఉంటున్నాయని అమెరికా అధికారులు తెలిపారు. అందకే భారతీయులకు.. ఈ లాటరీ కార్యక్రమానికి కావాల్సిన అర్హత పరిమితి మించిపోయిందని తెలిపారు. గ్రీన్ కార్డ్ లాటరీలో పాల్గొనడానికి వారికి అవకాశం ఇవ్వట్లేదని పేర్కొన్నారు.


ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2021లో 93,450 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. 2022లో ఆ సంఖ్య 1,27,010కు చేరింది. ఈ సంఖ్య అమెరికాకు వస్తున్న దక్షిణ అమెరికన్లు (99,030), ఆఫ్రికన్లు (89,570), యూరోపియన్ల (75,610) సంఖ్య కంటే ఎక్కువ కావడం గమనార్హం. 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నారు. అందుకే 2028 వరకు భారతీయులను యూఎస్‌ డైవర్సిటీ వీసా దరఖాస్తుకు అనర్హులుగా ప్రకటించినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, చైనా, వెనెజువెలా, ఫిలిప్పీన్స్, క్యూబా, కొలంబియా, బ్రెజిల్, కెనడా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్థాన్‌ పౌరులు కూడా.. ఈ గ్రీన్ కార్డ్ లాటరీకి అనర్హులు.


ఈ ఏడాది రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ఇమ్మిగ్రేషన్‌ విధానంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రైడ్లు, అరెస్టులు, బహిష్కరణలు చేస్తున్నారు. కేవలం ఇల్లీగల్ వలసలపైనే కాకుండా.. చట్టబద్ధంగా వచ్చినవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు మారుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa