ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనపై సీఎం చంద్రబాబు సంతృప్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 09:56 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాష్ట్రంలో జరిపిన పర్యటన అత్యంత విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అన్ని శాఖల అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించడం ఇది నాలుగోసారని చంద్రబాబు గుర్తుచేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో జరిగిన ఈ పర్యటనలో భాగంగా, కర్నూలులో ఏర్పాటు చేసిన 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' బహిరంగ సభ దిగ్విజయమైందని, ప్రజల్లోకి మంచి సందేశాన్ని పంపిందని ఆయన పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లే ప్రధాని పర్యటన విజయవంతమైందని సీఎం ప్రశంసించారు.ప్రధాని మోదీ కూడా ఈ పర్యటనను ఎంతో ఆస్వాదించారని, ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని చంద్రబాబు వెల్లడించారు. ముఖ్యంగా, శ్రీశైల మల్లికార్జున స్వామివారి దర్శనం తనకు ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చిందని ప్రధాని మోదీ తనతో చెప్పినట్లు ముఖ్యమంత్రి వివరించారు. అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'సూపర్ జీఎస్టీ' కార్యక్రమాలపై కూడా ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారని తెలిపారు.ఈ నేపథ్యంలో, జీఎస్టీపై నెల రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలు, వాటి ఫలితాలపై ఒక సమగ్రమైన పుస్తకాన్ని ప్రచురించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa