తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడిచే ఆలయాల్లో ప్రతి స్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు .. అమరావతిలోని వెంకటపాలెం సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. సాధారణ భక్తుడిలా నడుచుకుంటూ దర్శనానికి వెళ్లారు. ఆలయానికి చేరుకోగానే టెంపుల్ అర్చకులు, ఇన్స్పెక్టర్లు శ్రీ రామకృష్ణ, సందీప్ స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయంలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. తర్వాత కొందరు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ నాయుడు పరిశీలనలో అక్కడున్న సిబ్బంది అసలు బాగోతం బయటపడింది. ఆలయ పరిశుభ్రత, నిర్వహణలో లోపాలు చూసి అధికారులపై సీరియస్ అయ్యారు. దేవదేవుడి అలంకరణ, క్యూలైన్లు, ఏర్పాట్లుపై స్థానిక అధికారులు, సిబ్బందిపై టీటీడీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ఉద్యోగులు ఇలాంటి నిర్లక్ష్యాన్ని వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, నిర్వహణ మరింత నాణ్యంగా ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా కీలక ట్వీట్ పెట్టారు.
ఇకపై దేశం మొత్తం ఇదే తీరు..
"ఈరోజు (అక్టోబర్ 20) ఆకస్మికంగా వెంకటపాలెం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తనిఖీ చేశాను. సాధారణ భక్తుడిలా దర్శనానికి వెళ్లి, ఆలయ నిర్వహణలో కొన్ని నిర్లక్ష్యాలు గమనించాను. దేవదేవుడి అలంకరణ నుంచి - సిబ్బంది తీరు వరకు నిర్లక్ష్యం కనిపించడం బాధాకరం. ఇలాంటి వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. భక్తుల సేవలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఇకపై దేశంలోని అన్ని శ్రీవారి ఆలయాలను ఆకస్మికంగా సందర్శిస్తూ, భక్తులకు అందించే సేవా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాము" అని బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.
దళారుల బారిన పడకండి..
మరోవైపు, శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు వసతి కోసం దళారులను నమ్మి మోసపోవద్దని బీఆర్ నాయుడు శనివారం (అక్టోబర్ 18) భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో కొందరు దళారులు, మధ్యవర్తులు శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను పలు మార్గాల ద్వారా మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా ప్రభావిత స్థానాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులమని కొందరు మాయమాటలు చెప్పి.. శ్రీవారి బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కల్పిస్తామని ప్రలోభ పెడుతున్నట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అలాంటి నకిలీ వ్యక్తులు.. భక్తుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేసి మోసం చేస్తున్నట్లు అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఇప్పటికే భక్తులను మోసం చేస్తున్న అలాంటి వారిని.. టీటీడీ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa