ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్ ఎన్నికల్లో పోటీపై జేఎంఎం కీలక నిర్ణయం.. ఆర్జేడీ, కాంగ్రెస్‌లపై సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 20, 2025, 09:47 PM

బిహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీపై ఇండియా కూటమిలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అనూహ్య నిర్ణయం తీసుకుంది. తాము బిహార్‌లో పోటీకి దూరంగా ఉంటామని హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జేఎంఎం సోమవారం ప్రకటించింది. ఆరు స్థానాల్లో తాము ఒంటరిగా పోటీచేస్తామని ప్రకటించిన మర్నాడే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇండియా కూటమిలో మిత్రపక్షంగా ఉన్న జేఎంఎం. . ఈ నిర్ణయానికి తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్( ఆర్జేడీ), కాంగ్రెస్ రాజకీయ కుట్ర కారణమని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఝార్ఖండ్‌లో పొత్తులపై పునరాలోచిస్తామని, మహా కూటమిలో చీలిక విస్తృత పరిణామాలను కలిగిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు, బిహార్‌లో తమకు సీట్లు దక్కకుండా చేశారని ఆరోపించింది.


ఝార్ఖండ్‌లో కాంగ్రెస్, ఆర్జెడితో పొత్తులను తమ పార్టీ సమీక్షిస్తుందని, అవమానికి తగిన సమాధానం ఇస్తుందని జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ అన్నారు. ‘‘రాజకీయ కుట్రలో భాగంగా జేఎంఎం ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం వెనుక ఆర్జెడి, కాంగ్రెస్ కుట్ర ఉంది.. దీనికి జేఎంఎం తగిన సమాధానం ఇస్తుంది.. ఆ పార్టీలతో పొత్తుపై పునరాలోచిస్తాం.. మాతో రాజకీయ ఆటలు ఆడుతున్నారు.. బిహార్‌లో మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వం... ఈ ఎన్నికల్లో జేఎంఎం భాగం కాకపోవడంతో మహాకూటమి తీవ్రంగా నష్టపోవడం ఖాయం’ ఝార్ఖండ్ పర్యాటక మంత్రి అయిన కుమార్ అన్నారు.


తమను సంప్రదించకుండానే లాలూ ప్రసాద్ యాదవ్ తన అనుచరులకు సీట్లు కేటాయించడంతో ఆయన కుమారుడు తేజస్వీతో పాటు కాంగ్రెస్ సాక్ తిన్న సంగతి తెలిసిందే. కాగా, రెండు రోజుల కిందట చకాయ్, ధమ్దహా, కటోరియా, మనిహారి, జమై, పిర్ఫెంట్ స్థానాల్లో తాము పోటీచేస్తామని జేఎంఎం ప్రకటించింది. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరుపార్టీలు పోటీకి సిద్ధమైన నేపథ్యంలో జేఎంఎం ఈ ప్రకటన చేసింది. తత్ఫలితంగా కొన్ని స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఏర్పడే పరిస్థితి నెలకొంది. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడానిక కొంది గంటల ముందు ఆర్జేడీ పార్టీ మొత్తం 145 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.


సీట్ల సర్దుబాటు విషయంలో అధికార ఎన్డీయే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మిత్రపక్షాలను తగ్గించి, జేడీయూ, బీజేపీలు చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మిగతా 41 స్థానాల్లో ఎల్జేపీ 29, హిందూస్థాన్ అవామీ మోర్చా, రాష్ట్రీయ వికాశ్ సీల్ చెరో ఆరు స్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి.ఇక, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 20తో గడువు ముగియనుంది. నవంబరు 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా... నవంబరు 14న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa