ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్, అబుదాబి, యూఏఈలో పర్యటించనున్న సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 08:28 AM

ఏపీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించేందుకు ఆయన మంగళవారం నుంచి దుబాయ్, అబుదాబి, యూఏఈలలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరించి, పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రధానంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్నోవేషన్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. ఈ మేరకు పలువురు ప్రముఖ పెట్టుబడిదారులతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే ఈ పర్యటనలు చేపడుతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ముఖ్యమంత్రితో పాటు ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే పలు కీలక శాఖలకు చెందిన ఉన్నతాధికారుల బృందం కూడా పాల్గొంటోంది. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఇప్పటికే సింగపూర్, దావోస్ వంటి ప్రాంతాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను కలిశారు. మరోవైపు మంత్రి నారా లోకేశ్‌ కూడా ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa