రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. ధనత్రయోదశి సందర్భంగా భారీగా నగల అమ్మకాలు జరిగిన మరుసటి రోజే, మంగళవారం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వెండి, పసిడి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. సోమవారం చారిత్రక గరిష్ఠాలను తాకిన బంగారం, వెండి.. ఈరోజు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.దేశీయ మార్కెట్లో వెండి ధరలో భారీ పతనం కనిపించింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, నిన్న కిలో వెండి ధర ఏకంగా 7 శాతం పడిపోయింది. దీంతో కిలో వెండి ధర రూ. 1,71,275 నుంచి రూ. 1,60,100కి తగ్గింది. ఈ ప్రభావం సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా తీవ్రంగా పడింది. గత ఏడాదిలో 65-70 శాతం రాబడినిచ్చిన ఈ ఫండ్స్, ఒక్కరోజే 7 శాతం వరకు నష్టపోయాయి. అంతర్జాతీయంగా వెండి సరఫరా మెరుగుపడటం, సురక్షిత పెట్టుబడిగా డిమాండ్ తగ్గడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కూడా తగ్గింది. సోమవారం ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి $4,381.21 డాలర్లను తాకిన స్పాట్ గోల్డ్, మంగళవారం 0.3 శాతం తగ్గి ఔన్సుకు $4,340.29 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించారు. కాగా, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఈరోజు మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల వరకు ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ జరగనుంది.అయితే, ధరలు తగ్గినప్పటికీ పండుగ డిమాండ్ మాత్రం బలంగానే ఉంది. ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించిన వివరాల ప్రకారం, ధనత్రయోదశి రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 టన్నుల నగల అమ్మకాలు జరిగాయి. వీటి విలువ సుమారు రూ. 85 కోట్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే అమ్మకాల పరిమాణం ఒకేలా ఉన్నా, ధరలు పెరగడంతో మొత్తం విలువలో 35-40 శాతం వృద్ధి కనిపించిందని ఆ సంస్థ తెలిపింది. ముఖ్యంగా వెండి అమ్మకాలు ఈ సీజన్లో రెట్టింపు అయ్యాయని పేర్కొంది. దీపావళి, భాయ్ దూజ్తో కలిపి ఐదు రోజుల పండుగ సీజన్లో మొత్తం అమ్మకాలు 100 నుంచి 120 టన్నులకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa