బంగళాఖాతంలో వరుస అల్పపీడనాలు హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతోన్న అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రెండు అల్పపీడనాల కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. ఇది రాగల 24 గంటల్లో క్రమంగా దక్షిణ అంతర్గత కర్ణాటక వైపు ప్రయాణించి మరింత బలహీనపడతుందని పేర్కొన్నారు. అయితే, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు.
తీరం వెంబడి గంటకు 30- 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. మరోవైపు, బంగాళాఖాతంలో మరో వాతావరణ మార్పు చోటుచేసుకుంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంే తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబరు 24న (శుక్రవారం) ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడుతుందని ఆ సంస్థ పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడనాలతో విస్తృతంగా వర్షాలు పడుతుందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రంలో వర్షాలపై దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతిలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని తెలిపారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ, పోలీస్, నీటిపారుదల, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎం నిర్దేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa