అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన ఓ భారతీయుడు డ్రగ్స్ మత్తులో ట్రక్కు నడిపి ఘోర ప్రమాదానికి కారణమయ్యాడు. భారతీయ ట్రక్కు డ్రైవర్ మత్తులో పలు వాహనాలను ఢీకొట్టి ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘటన దక్షిణ కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. అమెరికా మీడియా కథనాల ప్రకారం.... 21 ఏళ్ల జషన్ప్రీత్ సింగ్ 2022లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి అక్కడ దొడ్డిదారిన కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ.. మార్చి 2022లో కాలిఫోర్నియాలో తొలిసారి బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లకు చిక్కాడు. కానీ, నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కారు తీసుకొచ్చిన ‘ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్’ పాలసీ కారణంగా కొద్దిరోజుల్లోనే జైలు నుంచి విడుదలయ్యాడు.
జైలు నుంచి బయటకు వచ్చాక ట్రక్ డ్రైవర్గా కొనసాగుతోన్న జషన్ప్రీత్ సింగ్.. డ్రగ్స్కు బానిసయ్యాడు. డ్రగ్స్ సేవించి వాహనం నడుపుతుండేవాడు. రెండు రోజుల కిందట డ్రగ్స్ మత్తులో ట్రక్కు నడిపి బీభత్సం సృష్టించాడు. శాన్ బెర్నార్డినో కౌంటీ ఎక్స్ప్రెస్పై ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లాడు. కార్లు, ఇతర వాహనాలు కూడా ధ్వంసమై ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. జష్ప్రీత్ సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో నిందితుడు జష్ప్రీత్కు నిర్వహించిన పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అతడిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తులు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. నిందితుడు డ్రగ్స్ మత్తులో ఉన్నందున ట్రాఫిక్ జామ్లోకి దూసుకెళ్లే ముందు బ్రేక్లు వేయలేదని పోలీసులు తెలిపారు. అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సైతం సింగ్ అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్టు నిర్దారించింది. కాగా, ఈ ఏడాది ఆగస్టులోనూ భారతీయ ట్రక్కు డ్రైవర్ హర్జీందర్ సింగ్ ఫ్లోరిడాలో ప్రమాదం చేసి, ముగ్గురు చావుకు కారణమయ్యాడు. అతడు కూడా 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్టు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా కాంగ్రెస్ ట్రక్కు డ్రైవర్లకు సంబంధించి కొత్త చట్టం తీసుకొచ్చింది. ఫ్లోరిడా టర్న్పైక్ మీద జరిగిన ప్రమాదం యావత్తు అమెరికా దృష్టిని అటువైపు తిప్పింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్లకు అసలు ఇంగ్లీష్ సరిగ్గా రాదని దర్యాప్తులో తేలింది. దీంతో వారికి ఇంగ్లిష్ తప్పనిసరి చేస్తూ సెనేట్ కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. ఇక, ట్రంప్ యంత్రాంగం సైతం బయట నుంచి వచ్చినవారు ఎవ్వరూ అమెరికాలో ట్రక్కు నడపడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. దీనికి నాటి జో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని ట్రంప్ మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa