ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ కమిషన్ ప్రతినిధులతో జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని లోకేశ్ వివరించారు. "గత 16 నెలల కాలంలోనే రాష్ట్రానికి 117 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాం. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న సమర్థవంతమైన నాయకుడి వల్లే ఇది సాధ్యమైంది" అని ఆయన పేర్కొన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఫార్మా, టూరిజం వంటి అనేక కీలక రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0'తో పాటు 24 థీమెటిక్ పాలసీలు పారిశ్రామిక ప్రగతికి మూలస్తంభాలుగా నిలుస్తున్నాయని లోకేశ్ అన్నారు. ముఖ్యంగా ఏఐ, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్ వంటి అధునాతన టెక్నాలజీ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. రాష్ట్రంలోని 6 పోర్టుల ద్వారా ప్రస్తుతం ఏటా 193 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరుగుతోందని, వచ్చే ఏడాది మరో 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తద్వారా పోర్టుల సామర్థ్యం 350 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa