ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్లీపర్ బస్సుల డిజైన్‌లోనే లోపం,,,,ఆ దేశాల్లో స్లీపర్ బస్సులు బ్యాన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 05:56 PM

కర్నూలు బస్సు ప్రమాదం అందరి హృదయాలను కదిలిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో స్లీపర్ బస్సులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఇలాంటి బస్సులు అనేక సార్లు ప్రమాదాలకు గురైనప్పుడు.. మరణాల రేటు ఎక్కువగానే ఉంది. అయినా అధికారులు స్లీపర్ బస్సులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే చైనా, జర్మనీలో స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించారు. అక్కడి కోర్టులు కూడా ప్రభుత్వాల నిర్ణయాలను సమర్థించాయి. ప్రజల ప్రాణాలు పోతున్నా.. మన దగ్గర మాత్రం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేకపోతోంది.


ప్రపంచవ్యాప్తంగా స్లీపర్ బస్సులు అనేక సార్లు ప్రమాదాలు గురయ్యాయి. చైనాలో 2009 తర్వాత నుంచి 13 స్లీపర్‌ బస్సు ప్రమాదాలు జరిగ్గా.. ఏకంగా 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2012లో వీటిపై చైనా నిషేధం విధించింది. ఇక కొన్ని దేశాలు స్లీపర్‌ బస్సుల వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. భద్రతా కారణాలు పేర్కొంటూ 2006లో జర్మనీ బ్యాన్ చేసింది. స్లీపర్ బస్సుల వినియోగంపై వియత్నాంలో కూడా పెద్ద ఎత్తిన చర్చ జరుగుతోంది. భారత్‌లో మాత్రం ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించి చేతులు దులుపుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఎందుకు బ్యాన్ చేశారు..


డిజైన్ లోపం..


నిజానికి స్లీపర్ బస్సుల డిజైన్‌లో లోపాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. స్లీపర్ బస్సుల్లో రెండు స్థాయిల్లో బెర్తులు ఉంటాయి. ఇలాంటి డబుల్ డెకర్ బస్సుల ఎత్తు ఎక్కువగా ఉండటంతో.. సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బస్సుకు స్థిరత్వం తగ్గుతుంది. దీంతో ఎక్కువ వేగంగా వెళ్లినా, అకస్మాత్తుగా బ్రేక్ వేసినా.. ఒక వైపుకు పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్లీపర్ బస్సుల ప్రమాదాలు జరిగినప్పుడు మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఇది ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.


ప్రమాదం జరిగితే, తప్పించుకోవడం కష్టం


స్లీపర్ల బస్సు లోపలి క్యాబిన్ చాలా ఇరుకుగా ఉంటుంది. నడిచే ప్లేస్ కూడా ఉండదు. ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర ద్వారం వద్దకు చేరుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక ప్రయాణికులు నిద్రలో ఉండి.. ప్రమాదం తర్వాత మేల్కొన్న వెంటనే అయోమయ పరిస్థితుల్లో ఉంటే.. ఎగ్జిట్ డోర్లను చేరుకోవడం కష్టం అవుతుంది. అంతేకాకుండా సరిపడా అత్యవసర ద్వారాలు కూడా స్లీపర్ బస్సుల్లో ఉండవు.


మండే స్వభావం గల మెటీరియల్స్..


స్లీపర్ బస్సులో దిండ్లు, పరుపులు, దుప్పట్లు, కర్టెన్లకు మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మంటలు చెలరేగిన కొద్ది క్షణాల్లోనే ఇవి బస్సు అంతా వ్యాపిస్తాయి. బస్సులో కిటికీలు ఉండవు. ఎయిర్ కండిషన్డ్ డిజైన్ వల్ల పొగ మొత్తం కంపార్ట్‌మెంట్‌లోకి వేగంగా నిండుతుంది. దీంతో కొద్ది సమయంలో మంటల్లో చిక్కుకుని ప్రయాణికులకు గాయాలు అవుతాయి. ఇక నిద్రలో ఉన్న వాళ్లు ఆ పొగ పీల్చడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. కాలిన గాయాలు కూడా మరణాల సంఖ్యను పెంచుతున్నాయి.


భారత్‌లో ఎందుకిలా?


వరుస ప్రమాదాల దృష్ట్యా.. ఈ బస్సులను బ్యాన్ చేసే బదులు.. కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (AIS) 119 పేరుతో స్లీపర్ కోచ్‌ల్లో పాటించాల్సిన నిబంధనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం బస్సులో ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. సరైనా బెర్తుల లేఅవుట్ ఉండాలి. బస్సులో మండే స్వభావం లేని వస్తువులను మాత్రమే ఉపయోగించాలి.


దురదృష్టవశాత్తు ఈ నిబంధనలను చాలా ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు పాతరేస్తున్నాయి. నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా బస్సులను నడిపిస్తున్నాయి. ఇష్టారీతిన బెర్తుల లేఅవుట్లు, ఫిట్‌నెస్ లేని బస్సులు ఉపయోగిస్తున్నారు. వాటిని సులభ నిబంధనలు ఉన్న రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయి. ఇక అధికారులు నిబంధనలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయ. అందుకే దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa