పాస్పోర్టులో ఇంటి పేరు లేదనే ఒకే ఒక్క కారణంతో ఏ మాజీ ఎమ్మెల్యేనే విమానం ఎక్కనివ్వలేదు విమానయాన సిబ్బంది. అప్పటికే చాలా సార్లు విమాన ప్రయాణం చేసిన అతడు.. వారి చెప్పింది విని షాక్ అయ్యారు. అలాంటి నిబంధనలేమీ ఉండవని.. తనను వెళ్లనివ్వమని కోరాడు. కానీ సిబ్బంది మాత్రం ఇంటి పేరు లేకపోతే విమానం ఎక్కడానికి వీళ్లేదని తేల్చి చెప్పారు. ఎంతగా బతిమాలినా అతడిని విమానంలోకి పంపించలేదు. దీంతో ఆయన న్యాయ పోరాటానికి దిగారు. ఈక్రమంలోనే వినియోగదారుల కమిషన్ దీనిపై విచారణ జరిపింది. అసలు నిబంధన ఇదేనని చెబుతూ.. ఎయిర్ లైన్స్కు గట్టి షాక్ ఇచ్చింది.
తమిళనాడు మాజీ శాసన సభ్యులు, న్యాయవాది అయిన నిజాముద్దీన్ 2023 ఫిబ్రవరి 9వ తేదీన మాస్కో నుంచి దుబాయ్ నగరంలో జరగాల్సిన ఓ ముఖ్యమైన సమావేశానికి బయలుదేరారు. అప్పటికే టికెట్ బుక్ చేసుకుని పాసుపోర్టు, టికెట్, అవసరమైన అన్ని సర్టిఫికేట్లు వెంట పెట్టుకుని విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గల్ఫ్ ఎయిర్ గ్రౌండ్ సిబ్బంది ఆయన బోర్డింగ్ను అడ్డుకున్నారు. నిజాముద్దీన్ పాస్పోర్ట్లో ఇంటిపేరు లేకపోవడం ఒక్కటే ఇందుకు కారణంగా చూపారు.
దుబాయ్లో ముఖ్యమైన కార్యక్రమం ఉందని, అంతకుముందు ఇదే పాస్పోర్ట్తో భారత్ నుంచి మాస్కోకు ప్రయాణించడానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదని ఆయన ఎంతగా విజ్ఞప్తి చేసినా సిబ్బంది వినిపించుకోలేదు. ముఖ్యంగా ఆయన్ను విమానం ఎక్కనివ్వకుండా సుమారు గంటన్నర పాటు వేచి చూసేలా చేశారు. ఆయన ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలిగించారు. ఈ అనూహ్య జాప్యం వల్ల ఆయన గమ్యస్థానానికి చేరుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. చివరకు ఆయన ఎలాగోలా దుబాయ్ వెళ్లి సమావేశంలో పాల్గొన్నారు. కానీ పాస్పోర్టులో ఇంటి పేరు లేదనే ఒకే ఒక్క కారణంతో విమానం ఎక్కనివ్వని సిబ్బందిపై మాత్రం న్యాయ పోరాటానికి దిగారు.
అది సేవలో స్పష్టమైన లోపమని చెబుతూనే.. అది తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని చెన్నైలోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు తెలిపారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కమిషన్.. ఎయిర్లైన్స్ సిబ్బంది విమానయాన నియమాలను పాటించడంలో విఫలమయ్యారని నిర్ధారించింది. ముఖ్యంగా సింగిల్ నేమ్ ఉన్న ప్రయాణికులకు సంబంధించిన మార్గదర్శకాలను గల్ఫ్ ఎయిర్ సక్రమంగా అమలు చేయలేదని తేల్చింది. దీంతో బాధిత మాజీ ఎమ్మెల్యే నిజాముద్దీన్కు తగిన పరిహారం చెల్లించాలని గల్ఫ్ ఎయిర్ను ఆదేశించింది.
టికెట్ కోసం ఖర్చు చేసిన మొత్తం, సేవల్లో లోపం, ఆర్థిక నష్టంతో పాటు ప్రయాణికుడు అనుభవించిన మానసిక ఆవేదనకు పరిహారంగా మొత్తంగా రూ. 1.4 లక్షలు చెల్లించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ మొత్తాన్ని ప్రయాణ తేదీ నుంచి 9 శాతం వడ్డీతో సహా చెల్లించాలని చెప్పింది. పాస్పోర్టులో ఇంటి పేరు లేకపోవడం అనేది పెద్ద తప్పిదం కాదని.. ఆమాత్రం దానికే విమానం ఎక్కనివ్వకపోవడం సరికాదని పేర్కొంది. ఇకపై ఏ విమానయాన సంస్థలు కూడా ఇలా నడుచోకూకడదని.. ఒకవేళ ఇలాంటి తప్పిదాలు చేస్తే సరైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించింది. దీన్ని బట్టి పాస్పోర్టులో ఇంటిపేరు లేకపోయినా విమానం ఎక్కొచ్చని నిబంధనలు చెబుతున్నట్లు తేటతెల్లమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa