ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుఫాన్ భయాల మధ్య కాకినాడ ప్రజలకు ఊరటనిచ్చిన పవన్ కళ్యాణ్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 08:50 PM

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ ప్రభావం ప్రారంభమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో తుఫాన్‌ జల్లులు విస్తారంగా కురుస్తున్నాయి. ఎల్లుండి కాకినాడ తీరానికి సమీపంలో తుఫాన్‌ భూభాగాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు ఉదయం నుంచే తుఫాన్‌ ప్రభావం మరింత తీవ్రమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం ఉన్న కాకినాడ జిల్లాలో పరిస్థితులను సమీక్షించేందుకు ఇవాళ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ మంత్రి నారాయణను కాకినాడకు పంపి, స్థానిక అధికారులతో తుఫాన్‌ పరిస్థితులు, ఏర్పాట్లపై వివరంగా చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్‌ అధికారులు తీసుకోవాల్సిన పలు కీలక చర్యలపై దిశానిర్దేశం చేశారు.అదే సమయంలో కాకినాడ ప్రజలకు ఊరటనిచ్చే సమాచారాన్ని కూడా వెల్లడించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు, ఈతగాళ్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు తక్షణం తెలియజేయాలని అధికారులకు ఆదేశించారు.మొంథా తుఫాన్‌ కాకినాడ తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌ ప్రభావం 12 మండలాలపై పడే అవకాశం ఉన్నందున, ముందస్తు చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి, వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు, ఔషధాలు అందుబాటులో ఉండేలా చూడాలని పవన్ ఆదేశించారు.గాలుల వేగం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున విద్యుత్ స్తంభాలు కూలిపోవడంపై అప్రమత్తంగా ఉండి, విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. అలాగే గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, రోగులు వంటి వర్గాలను ప్రత్యేకంగా గుర్తించి వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంతో పాటు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్‌ ఆదేశించారు.తుఫాన్‌ సమయంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. అత్యవసర సాయంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.19 కోట్ల నిధులు విడుదల చేయగా, అందులో కాకినాడ జిల్లాకు రూ.1 కోటి కేటాయించినట్టు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాల కల్పన, ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ, ఇళ్లు కూలిన లేదా దెబ్బతిన్న కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని పవన్ కళ్యాణ్‌ అధికారులను దిశానిర్దేశం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa