ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీబీఎల్‌లోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ?,,,క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ సానుకూల సంకేతాలు

sports |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 09:21 PM

చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో బరిలోకి దిగిన భారత స్టార్ ఆటగాళ్లు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆఖరి సిడ్నీ వన్డేలో రోహిత్, విరాట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. హిట్‌మ్యాన్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కూడా వరుస డకౌట్ల ఒత్తిడిలో.. మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వికెట్‌కు 150కిపైగా పరుగులు జోడించి.. అజేయంగా నిలిచి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించారు. వారి బ్యాటింగ్‌తో సిడ్నీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. వీరి కెరీర్ చివరి దశకు వచ్చినప్పటికీ.. ఆస్ట్రేలియాలో వీరికి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.


ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహిస్తున్నటువంటి.. టీ-20 లీగ్ బిగ్ బాష్ లీగ్‌లో వీరిని ఆకర్షించగలుగుతారా అన్న ప్రశ్నకు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ సానుకూల సంకేతాలు ఇచ్చారు. 'స్వల్ప కాలం నుంచి మధ్య కాలం వరకు (అంటే కొన్ని నెలలు లేదా సంవత్సరాల్లో).. కోహ్లీ, రోహిత్ వంటి ఆటగాళ్లను బీబీఎల్‌కు తీసుకురావడం ఆచరణ సాధ్యమే. మేము అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాం.' అని అన్నారు.


ఇప్పటికే భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆ లీగ్ ఆడబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. సిడ్నీ థండర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలిసింది. ఇది కూడా బీబీఎల్ భవిష్యత్తుకు శుభ సూచకం అని గ్రీన్‌బర్గ్ చెప్పారు. అశ్విన్ రాక.. ఇతర భారత ఆటగాళ్లు కూడా తమ లీగ్‌లోకి వచ్చేందుకు ఉపకరిస్తుందని చెప్పడం విశేషం. ఇక భారత స్టాక్ ప్లేయర్లను తమ లీగ్‌లోకి తీసుకొచ్చేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుందని.. ఇందుకోసం అవసరమైన అన్ని ఆప్షన్లను పరిశీలిస్తామని చెప్పారు. బీబీఎల్‌లోకి ప్రైవేట్ క్యాపిటల్‌ను తీసుకురావాలా వద్దా అనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.


అంత ఈజీ కాదు..


కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లను బీబీఎల్‌లో చూడాలని ఆశించే అభిమానులకు.. బీసీసీఐ రూల్స్ పెద్ద అడ్డంకిగా మారనున్నాయి. యాక్టివ్‌గా భారత క్రికెట్ తరఫున ఆడుతున్న ఆటగాళ్లు.. విదేశీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు అనుమతి లేదు. ప్రస్తుతం ఇరువురూ.. అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో ఆడుతుండటంతో పాటుగా.. బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్‌లో కూడా ఉన్నారు. అంటే.. వీరు ఆ లీగ్‌ల్లో పాల్గొనాలంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది.


ఇటీవల రవిచంద్రన్ అశ్విన్.. ఇందుకోసమే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు కూడా. దీంతో అతడికి బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొనేందుకు మార్గం సుగమం అయింది. అయితే.. రోహిత్, కోహ్లీ.. బీబీఎల్‌లో ఆడాలన్నా.. ఇందుకోసం కొన్నేళ్లు పట్టొచ్చు. వీరు ప్రస్తుతం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకుంటున్న సంగతి తెలిసిందే. తర్వాత ఐపీఎల్‌కు కూడా రిటైర్ అయితే.. బీబీఎల్‌లో ఆడొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa