దేశవ్యాప్తంగా ఇప్పుడు పండగ సీజన్ ఉన్న సంగతి తెలిసిందే. బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాలు ముగియగా.. తర్వాత దీపావళి పండగ వేడుకలు జరుపుకున్నారు ప్రజలు. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో పవిత్రమైన ఛఠ్ పూజ ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు కూడా తెగబడుతున్నారు. ఈ పండగను అడ్డం పెట్టుకొని.. ఇదే అదునుగా ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ సామాన్యులు ఎక్కువగా పెట్టుబడులు పెట్టే.. ఇండియా పోస్ట్ పేరును వాడుకుంటుండటం గమనార్హం. ఇండియా పోస్ట్.. "ఛఠ్ పూజ సబ్సిడీ", 'లక్కీ డ్రా రివార్డ్' పేరిట రూ. 20 వేలు సబ్సిడీ ఇస్తున్నట్లు తప్పుడు సదేశాల్ని.. సోషల్ మీడియా, వాట్సాప్ల్లో విరివిగా షేర్ చేస్తున్నారు.
>> దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అధికారిక ఫ్యాక్ట్ చెక్ విభాగం.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ క్లెయిమ్ను ధ్రువీకరించిన తర్వాత.. తీవ్రంగా ఖండించింది. ఈ క్లెయిమ్ పూర్తిగా అబద్ధమని స్పష్టం చేసింది. ఈ పోస్ట్తో .. ఇండియా పోస్ట్కుగానీ.. ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదని పీఐబీ స్పష్టం చేసింది. ఆ వైరల్ పోస్టును పేర్కొని.. అది ఫేక్ అని స్పష్టం చేసి.. తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.
ఇదే సమయంలో అసలు ఇలాంటి సైబర్ దాడుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టం చేసింది. మోసగాళ్లు పంపే సందేశాల్లో.. ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్పైన క్లిక్ చేస్తే.. అది అచ్చంగా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ను తలపించే నకిలీ వెబ్సైట్కు దారితీస్తుంది. ఇలా నకిలీ వెబ్సైట్స్ ద్వారా.. సబ్సిడీలు లేదా బహుమతులు వంటివి ఇస్తామని నమ్మించి.. బాధితుల నుంచి బ్యాంక్ అకౌంట్లు, ఆధార్, పాన్ నంబర్లు, వీటి ద్వారా ఓటీపీ పంపడం ద్వారా డబ్బుల్ని లాక్కుంటారు. ఇతర వ్యక్తిగత, ఆర్థిక వివరాల్ని కూడా దుర్వినియోగం చేస్తుంటారు.
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇలాంటి మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్, SMS, ఇ- మెయిల్ ద్వారా వచ్చిన సందేహాత్మక, అనుమానాస్పద లింక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. ఇంకా బ్యాంక్ డీటెయిల్స్, ఏటీఎం పిన్, ఆధార్ నంబర్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారం వివరాలు షేర్ చేయొద్దు. అలాంటి అనుమానాస్పద సందేశాల్ని వెంటనే డిలీట్ చేయండి. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని కూడా ఇలాంటి వాటి పట్ల అప్రమత్తం చేయండి. ఇలా మీకు అనుమానాస్పదంగా కనిపించిన లింక్ లేదా ఇమేజ్ను @pibfactcheck కు ట్విట్టర్లో పంపి వాస్తవాల్ని తెలుసుకోవచ్చు. సంచార్ సాథి వెబ్సైట్ ద్వారా కూడా రక్షించుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa