ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగు నెలల్లో ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల పూర్తి.. నారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 08:25 PM

అమరావతి రైతులకు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త వినిపించారు. అమరావతి రైతులకు వచ్చే నాలుగు నెలల్లో రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రెజిస్ట్రేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలోనూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొంతమంది పోస్టులు పెడుతున్నారని నారాయణ అన్నారు. అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపుగా తుది దశకు చేరుకున్నట్లు నారాయణ వివరించారు. వచ్చే నాలుగు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.


మరోవైపుఅమరావతి రాజధాని నిర్మాణంకోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి భూమిని సమీకరించింది. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా సుమారుగా 34 వేల ఎకరాల భూమిని సమీకరించింది. ల్యాండ్ పూలింగ్ కింద 30,635 మంది రైతుల నుంచి సమీకరించిన 34,911.23 ఎకరాల భూమికి సంబంధించి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాల్సి ఉండగా..ఇప్పటివరకూ 29,644 మంది రైతులు ఇచ్చిన 34,192.19 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తైందని మంత్రి నారాయణ వివరించారు. 2024 ఎన్నికల్లో గెలిచి ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకూ 2727 మంది రైతులకు 3188 ఎకరాలకు సంబంధించి ప్లాట్ల కేటాయింపు పూర్తైందని నారాయణ వివరించారు.


ఇంకా 991 మంది రైతులకు 719 ఎకరాలకు సంబంధించిన ప్లాట్లు కేటాయించాల్సి ఉందని నారాయణ వెల్లడించారు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి ఇంకా 2501 మందికి 8441 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని మంత్రి నారాయణ వివరించారు. వేర్వేరు కారణాలతో ఈ రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. ఆయా రైతులతో మాట్లాడి పెండింగ్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తూ వస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే నాలుగు నెలల్లో ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు మొత్తం పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే పలు సాంకేతిక సమస్యలతో 484 మంది రైతులకు 3.15 కోట్ల కౌలు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి నారాయణ వివరించారు. ఈ విషయాల్లో రైతులకు అవాస్తవాలు చెప్పి గందరగోళానికి గురి చేయవద్దని మంత్రి నారాయణ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa