ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్క్.. ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 08:30 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలోని పలువురు నేతలు, ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. ముఖ్య నేతలు మొదలుకుని.. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కూటమి పార్టీల్లో చేరిన పరిస్థితి. ఇక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గురించి చెప్పాల్సిన పని లేదు. దీంతో చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ అధికారం కోల్పోయింది. తాజాగా అనంతపురం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్‌ను.. ప్రభుత్వం ఛైర్మన్ పదవి నుంచి తప్పించింది. మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న రాజ్ కుమార్.. 15 నెలలుగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 22న షోకాజ్ నోటీసులు ఇచ్చింది.


అయితే ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న మున్సిపల్ ఛైర్మన్ రాజ్ కుమార్.. నోటీసులపై వివరణ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోవడంతో కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ రాజ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధులకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదనే కారణాలతో పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు 2024 నవంబర్ నెల నుంచి 2025 ఏప్రిల్ నెల వరకూ.. రెండు నెలల వ్యవధిలో నిర్వహించాల్సిన కౌన్సిల్ మీటింగులను రాజ్ కుమార్ నిర్వహించలేదని జీవోలో పేర్కొంది.


పండ్ల వ్యాపారి నుంచి ఛైర్మన్ వరకూ..


మరోవైపు తలారి రాజ్ కుమార్.. పండ్లు విక్రయించే వ్యాపారి. మున్సిపల్ ఛైర్మన్ కాకముందు తోపుడు బండిపై పండ్లు విక్రయించేవారు. ఇంటర్‌ వరకూ చదువుకున్నారు. తలారి రాజ్ కుమార్‌కు భార్య విజయలక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణలో భాగంగా రాజ్ కుమార్ 2021కి ముందు తోపుడుబండిపై పండ్లు విక్రయించేవారు. అయితే వైసీపీపై అభిమానంతో ఆ పార్టీలో కార్యకర్తగా పనిచేసేవారు. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆయనకు లభించింది. కళ్యాణదుర్గం పదో వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఆయనకు జాక్ పాట్ తగిలింది. ఊహించని విధంగా కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవి వరించింది. అయితే ప్రభుత్వం మారటం.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తన పదవిని కోల్పోయారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa