కరూర్ రోడ్షోలో 41 మంది దుర్మరణం సంఘటన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న తమిళగ వెట్రి కళగం నేత విజయ్ మళ్ళీ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవల కరూర్ మృతుల కుటుంబ సభ్యులను మహాబలిపురం రిసార్ట్కు రప్పించి వారికి క్షమాపణ చెప్పి, గాయపడిన వారికి తలా రూ.2లక్షలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తర్వాతే ఆయన ధాన్యం కొనుగోలు వ్యవహారంపై డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సుదీర్ఘ ప్రకటన చేశారు.బుధవారం సాయంత్రం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై 28 మంది సభ్యులతో కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ పార్టీ వ్యవహారాలను చురుకుగా సాగించాలని ఆయన నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ అధ్యక్షతన పనయూరులోని పార్టీ కార్యాలయంలో కొత్త కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నిర్మల్కుమార్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ నిర్వాహక కమిటీ తొలిసమావేశం సాఫీగా సాగిందని,మళ్ళీ పార్టీ వ్యవహారాలను చురుకుగా కొనసాగించాలని పార్టీ నాయకులంతా సూచించినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. కరూర్ దుర్ఘటన పార్టీ వ్యవహారాలను పూర్తిగా స్తంభింపజేసిందని, ఆ శోకం నుండి పూర్తిగా బయటపడి పార్టీ నాయకుడు విజయ్ మళ్ళీ చురుకుగా పార్టీపై దృష్టిసారిస్తున్నారన్నారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటారా? అని విలేఖరుల ప్రశ్నించగా, నెల రోజులకు ముందు పార్టీ ఏ స్థితిలో ఉండేదో ఆ స్థితిలోనే పార్టీ వ్యవహారాలు కొనసాగుతాయని ఆ పార్టీతో పొత్తు లేనట్లేనని సూచన ప్రాయంగా నిర్మల్కుమార్ తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa