ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల నడకమార్గంలో చిరుత కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 07:19 PM

తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి కనిపించింది. శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు వెళ్లే దారిలో 150వ మెట్టు వద్ద చిరుత కనిపించడంతో భక్తులు భయంతో కేకలు వేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి కనిపించడం భక్తులకు ఆందోళన కలిగించింది. శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు వెళ్లే దారిలో, సరిగ్గా 150వ మెట్టు వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను చూసి భక్తులు ఒక్కసారిగా కేకలు పెట్టారు. సులభ్‌ కార్మికుల సమాచారం ఇవ్వడంతో వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చిరుత సంచారం నిజమేనని వారు నిర్ధారించారు. భద్రత దృష్ట్యా, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.


800వ మెట్టు వద్ద, అలాగే శ్రీవారి మెట్టు ప్రారంభంలో భక్తులను కొద్దిసేపు ఆపేశారు. ప్రస్తుతం 100 నుంచి 150 మంది భక్తులను ఒకేసారి గుంపులుగా మాత్రమే మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి అనుమతిస్తున్నారు. అటవీ అధికారులు చిరుతపులిని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, సిబ్బంది సూచనలను పాటిస్తూ తిరుమలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా, చిన్న పిల్లలను చేతుల్లో పట్టుకుని జాగ్రత్తగా వెళ్లాలని తెలిపారు.


తిరుమలలో ఘనంగా మెట్లోత్సవం


దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో తిరుమల శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శుక్రవారం తెల్లవారుజామున అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా టీటీడీ పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు కలిసి మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామివారి కృపకుపాత్రులయ్యారనిటిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి చెప్పారు. ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.


వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు శ్రీఆనందతీర్థాచార్యులు. భజన మండళ్ల సభ్యులకు తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక శిక్షణ, దాస సాహిత్యంలో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు. అంతకుముందు భజనమండళ్ల స‌భ్యులు అలిపిరి పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3,500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa