ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో అత్యధికంగా విస్కీ తాగే టాప్-10 రాష్ట్రాలు.. 3, 4 స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

national |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 07:24 PM

మన దేశంలో దక్షిణాదిన ఆల్కహాల్ సేవించే సంస్కృతి అధికంగా ఉంటుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. మద్యంపైనే రాష్ట్రాలకు అధిక ఆదాయం లభిస్తూ ఉంటుంది. మద్యంపై వచ్చే ఆదాయమే రాష్ట్ర ఖజానాకు భారీగా సమకూరుతోంది. ఈ క్రమంలోనే ఇండియన్ విస్కీ మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతూనే ఉంది. ఇక భారత్‌లో తయారు చేసిన విదేశీ మద్యం అమ్మకాల్లో కొన్ని ప్రాంతాల్లో అధికంగా అమ్ముడైపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒకే రోజు వందల కోట్ల అమ్మకాలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి.


ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో తయారయ్యే ఫారిన్ మద్యం విభాగంలో విస్కీ వినియోగం అధికంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి.. భారత ఆల్కహాలిక్ పానీయాల కంపెనీల సమాఖ్య (సీఐఏబీసీ) డేటా ప్రకారం.. దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్కీ అమ్మకాలు అధికంగా జరిగాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానపరమైన సంస్కరణలు, ప్రీమియం బ్రాండ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు స్థిరంగా ఉన్నప్పటికీ.. దక్షిణ భారతదేశంలో విస్కీ అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు పేర్కొన్నాయి.


2025 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విభాగంలో మొత్తం 40.17 కోట్ల కేసుల మద్యం విక్రయాలు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. విస్కీ వినియోగంలో జాతీయ స్థాయిలో చిన్నపాటి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. దేశంలో అమ్ముడవుతున్న విస్కీలో ఏకంగా 58 శాతం వాటాతో దక్షిణాది రాష్ట్రాలే అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.


విస్కీ అమ్మకాల్లో టాప్ 10 రాష్ట్రాలు


దేశవ్యాప్తంగా 2025 ఆర్థిక ఏడాదిలో విస్కీ విక్రయాల్లో టాప్ 10 రాష్ట్రాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా ఆధిపత్యం కనబరుస్తున్నాయి. దేశం మొత్తంలో 17 శాతం వాటాతో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 6.83 కోట్ల కేసుల విస్కీ బాటిళ్లు అమ్ముడుపోయాయి. బెంగళూరు వంటి మెట్రో నగరం కారణంగా కర్ణాటక మొదటి స్థానంలో ఉండటానికి కారణం అయిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 13 శాతం మార్కెట్ వాటాతో తమిళనాడు రెండో ప్లేసులో ఉంది. 5.22 కోట్ల కేసులు విక్రయించారు.


9 శాతం మార్కెట్ వాటాతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. తెలంగాణలో ఈ ఏడాది 3.61 కోట్ల కేసుల మద్యం అమ్ముడైంది. తెలంగాణలో తలసరి విస్కీ వినియోగం దేశంలోనే అత్యధికంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు హైదరాబాద్‌లోని విస్తరిస్తున్న మధ్యతరగతి వినియోగదారులే కారణమని పేర్కొంటున్నాయి. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ 8 శాతం మార్కెట్ వాటాను కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 3.21 కోట్ల మద్యం సీసాలు విక్రయం అయ్యాయి. 5వ స్థానంలో మహారాష్ట్ర 7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండి.. 2.81 కోట్ల మద్యం కేసుల అమ్మకాలు జరిగాయి.


ఇక 6 శాతం మార్కెట్ వాటాతో ఉత్తర్‌ప్రదేశ్.. 3 శాతం మార్కెట్ వాటాతో ఢిల్లీ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా విస్కీ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉండటం గమనార్హం. విస్కీ మార్కెట్ కేవలం వినియోగంలోనే కాకుండా.. ఆర్థిక వ్యవస్థకు కూడా బలంగా మద్దతు ఇస్తోంది. భారత విస్కీ మార్కెట్ 2024 నాటికి 19.16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2025 నాటికి మొత్తం స్పిరిట్స్ మార్కెట్‌లో దాదాపు 67 శాతం వాటాను విస్కీ రంగం అందించనుంది. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5.3 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోంది.


ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రమే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మద్యం రంగం ద్వారా సుమారు రూ.45,570 కోట్ల ఎక్సైజ్ ఆదాయం సమకూరింది. బ్రిటన్-భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల స్కాచ్, విస్కీ సుంకాలు తగ్గితే.. రాబోయే 5 ఏళ్లలో ఎగుమతులు 1 బిలియన్ పౌండ్ల మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. విస్కీ వినియోగం భారత్‌లో ఒక బలమైన సాంస్కృతిక, ఆర్థిక అంశంగా మారిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa