దేశ రాజధాని ఢిల్లీవాసులను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విషపూరితంగా మారిన గాలితో జనం విలవిలలాడిపోతున్నారు. గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యల తీవ్రత పెరగడం, ఊపిరి ఆడకపోవడం వంటి ఫిర్యాదులతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. లోకల్సర్కిల్స్ అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం.. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని 75 శాతం ఇళ్లలో ఒక్కరు కంటే ఎక్కువ మంది కోవిడ్, ఫ్లూ లేదా వైరల్ ఫీవర్ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్లోని 15 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) గురువారం ఢిల్లీలో గాలి నాణ్యత 373 (అత్యంత దారుణం)గా నమోదయ్యింది. ముందు రోజు బుధవారం (279)తో పోల్చితే ఇది అధికం. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఐఐటీ కాన్పూర్ మేఘమథనం ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే.
సాకేత్లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైస్-ఛైర్మన్, ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణుడు డాక్టర్ వివేక్ నంగియా ప్రకారం.. గురువారం తమ ఆసుపత్రికి వచ్చిన 100 శాతం మందికి దీపావళి నుంచి అనారోగ్య లక్షణాలు తీవ్రమయ్యాయని ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. ‘‘మేము స్పష్టంగా గమనించిన విషయం ఏంటంటే.. ఇప్పుడు వస్తున్న వారంతా వాయు నాణ్యత తగ్గిపోయినప్పటి నుంచి దగ్గు, ఊపిరి ఆడకపోవడం, గుండెలో దడ, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు తీవ్రమయ్యాయని చెబుతున్నారు’’ అని ఆయన తెలిపారు. మరో ఆసుపత్రి వైద్యుడు కూడా ముక్కు దిబ్బడ, కళ్లలో మంటలు, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలతో వచ్చేవారు అధికంగా ఉన్నారని చెప్పారు. వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకునే శీతాకాలం నాలుగు నెలలు ఢిల్లీవాసులకు క్షణమొక యుగంలా నడుస్తుంది.
సాధారణంగా ఐదేళ్లలోపు.. 65 ఏళ్లు కంటే ఎక్కువ వయసున్నవాళ్లే ప్రభావితమవుతారు. కానీ, దీని ప్రభావం అన్ని వయసుల వారిపైనా కనిపిస్తోందని డాక్టర్ నంగియా అభిప్రాయపడ్డారు. ‘క్లుప్తంగా చెప్పాలంటే వయసు ప్రధాన అంశం కాదు.. అంతర్లీన పరిస్థితులు, ఆరోగ్య కారణాలు ఉంటాయి’ అని ఆయన అన్నారు. వాయు నాణ్యత దారుణంగా తగ్గిపోవడంతో చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రెయిన్బో చిల్ట్రన్ హాస్పిటల్ పీడియాట్రిషియన్ డాక్టర్ మేధా తెలిపారు. గత కొన్ని వారాలుగా శ్వాసకోశ సమస్యలతో తీసుకొచ్చే పిల్లల సంఖ్య పెరుగుతోందని వివరించారు. కళ్ల మంటలు, దురద వంటి సమస్యలతో వచ్చే బాధితులు కూడా ఎక్కువగా ఉన్నారని అన్నారు.
కాంటాక్ట్ లెన్స్ లేదా ఇప్పటికే కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమవుతారని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు కళ్లద్దాలు ధరించాలని, చేతులతో కంటిని తాకడం చేయొద్దని, ఇంటికి వచ్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa