బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో.. అధికార, ప్రతిపక్ష పార్టీలు సహా స్వతంత్ర అభ్యర్థులు సైతం హామీల వర్షం కురపిస్తున్నారు. అయితే తాజాగా అధికార ఎన్డీయే కూటమి ఓటర్లను ఆకర్షించడానికి ఎవరూ ఊహించని హామీలు ఇచ్చింది. ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్తో పాటు ఎల్జేపీ (రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాసవాన్ శుక్రవారం ఉదయం పట్నాలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, మహిళా సాధికారతపై దృష్టి సారించారు. ఏకంగా కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో పాటు కోటి మందిని లఖ్పతి దీదీలుగా మారుస్తామని చెప్పింది.
బిహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న కార్మికులను దృష్టిలో ఉంచుకుని.. వారిని రాష్ట్రంలోనే నిలపడం కోసం ఎన్డీయే కూటమి ఒక భారీ హామీని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలను మెరుగు పరచడానికి.. ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంపై ఎన్డీయే కూటమి ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేనిఫెస్టోలో 'లఖ్పతి దీదీ' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. దీని ద్వారా రాష్ట్రంలో కోటి మంది మహిళలు ఏడాదికి కనీసం రూ. లక్ష వరకు సంపాదించేలా తీర్చిదిద్దుతామన్నారు. మహిళలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వీలుగా వారికి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ. 9,000 పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ప్రజలకు రూ. 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ.. బిహార్లో ఏడు ఎక్స్ప్రెస్వేలు, నాలుగు ముఖ్య నగరాల్లో మెట్రో రైలు సేవలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాబోయే ఐదేళ్లలో రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తామని.. ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు, మెడికల్ కాలేజీలను నెలకొల్పుతామని ఎన్డీయే స్పష్టం చేసింది. ఈ మేనిఫెస్టో బీహార్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని నేతలు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa