ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇంట్లోంచి వెళ్లిపో'.. యువరాజుకు షాకిచ్చిన బ్రిటన్ రాజు

international |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 09:42 PM

అమెరికాను కుదిపేసిన అతిపెద్ద సెక్స్ కుంభకోణం కేసులో అనేక మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ట్రంప్, ఇవాంకా ట్రంప్, మెలానియా ట్రంప్ సహా మరెంతో మందికి ఆయనతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. అలాగే బ్రిటన్ యువరాజు అయిన ప్రిన్స్ ఆండ్రూస్‌కు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే బ్రిటన్ రాజకుటుంబం కీలకమైన, కఠినమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బ్రిటన్ రాజు చార్లెస్ III.. తన సొంత సోదరుడు ప్రిన్స్ ఆండ్రూపై తీవ్ర చర్యలు తీసుకుంటూ ఆయనకు ఉన్న అన్ని రాజ బిరుదులు, అధికారాలను తొలగించారు.


అంతేకాకుండా ఆయన్ను లండన్‌లోని అధికారిక నివాసం నుంచి కూడా బలవంతంగా బయటకు పంపించి వేశారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో అధికారికంగా ధృవీకరించింది. దివంగత రాణి ఎలిజబెత్ II రెండో కుమారుడు, రాజు చార్లెస్ తమ్ముడు అయిన ప్రిన్స్ ఆండ్రూ.. గత కొంతకాలంగా ఎప్‌స్టీన్ కుంభకోణం కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తాజా పరిణామాల్లో భాగంగా ప్రిన్స్ ఆండ్రూకు ఉన్న అన్ని రాజ గౌరవాలు, బిరుదులు, అధికారాలను రాజు చార్లెస్ III రద్దు చేశారు. గతంలోనే ఈ వివాదం కారణంగా ఆండ్రూ తన అత్యంత ముఖ్యమైన రాయల్ టైటిల్ అయిన 'డ్యూక్ ఆఫ్ యార్క్'ను వదులుకున్నారు. అయినప్పటికీ.. రాజకుటుంబం ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు అనివార్యమని రాజు చార్లెస్ భావించినట్లు ప్యాలెస్ ప్రకటనలో పేర్కొంది.


బిరుదుల తొలగింపుతో పాటు ప్రిన్స్ ఆండ్రూ ప్రస్తుతం లీజుకు తీసుకుని నివసిస్తున్న లండన్‌లోని విండ్సర్ ఎస్టేట్‌ను కూడా వెంటనే ఖాళీ చేయాలని అధికారిక నోటీసులు పంపించారు. దీంతో ప్రిన్స్ ఆండ్రూ తన నివాసాన్ని తూర్పు ఇంగ్లాండ్‌లోని రాజ కుటుంబానికి చెందిన ప్రైవేట్ ఎస్టేట్ అయిన సాండ్రిగ్‌ హోమ్‌కు మార్చాల్సి ఉంటుంది. ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంలో భాగమైన వర్జీనియా గ్రిఫీ అనే బాధితురాలు ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక ఆరోపణలు చేసింది. 17 ఏళ్ల వయస్సులో యువరాజు తనపై మూడు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె పేర్కొంది. ఈ ఆరోపణలను ప్రిన్స్ ఆండ్రూ పదేపదే తిరస్కరిస్తూ వచ్చారు.


అయితే ఇటీవల గ్రిఫీ రాసిన 'నోబడీస్ గర్ల్' అనే పుస్తకం విడుదల నేపథ్యంలో ఈ అంశం మరోసారి అంతర్జాతీయ చర్చకు వచ్చింది. ఈ సమయంలో రాజు చార్లెస్, రాణి కెమిల్లా తాము ఈ కుంభకోణంలో బాధితుల వైపే ఉంటామని స్పష్టం చేయడం గమనార్హం. ప్యాలెస్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు రాజకుటుంబం పరువును కాపాడటానికి, వ్యవస్థీకృత నేరాలపై తమ వైఖరిని తెలియజేయడానికి తీసుకున్న చర్యలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa