ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారుపై మూత్ర విసర్జన వద్దన్నాడని.. కెనడాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య

Crime |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 09:50 PM

తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న ఒక అపరిచితుడిని ప్రశ్నించినందుకు.. కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ అత్యంత అమానుషమైన సంఘటన కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో అక్టోబర్ 19వ తేదీన జరిగింది. ముందుగా దాడికి గురైన 55 ఏళ్ల అర్వి సింగ్ సాగూ.. ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో గత శుక్రవారం రోజు పోరాడి తుది శ్వాస విడిచారు.


అసలేం జరిగిందంటే..?


55 ఏళ్ల అర్వి సింగ్ సాగూ తన స్నేహితురాలితో కలిసి రాత్రి బయటకు వెళ్లాడు. నగరంలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే తమ కారు వద్దకు వస్తుండగా ఈ ఘోరం జరిగింది. అయితే అప్పటికే ఒక అపరిచితుడు సాగూ కారుపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. తన కారుపై ఓ వ్యక్తి మూత్రం పోయడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన సాగూ.. ఆపమంటూ అరిచాడు. "హే.. నువ్వేం చేస్తున్నావు?" అంటూ ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. దానికి ఆ అపరిచితుడు అహంకారంగా "నా ఇష్టం.. ఏమి చేయాలనుకుంటే అది చేస్తాను" అంటూ సమాధానం ఇచ్చాడు.


అక్కడితో ఆగకుండా వెంటనే సాగూ వద్దకు వేగంగా నడుచుకుంటూ వచ్చాడు. క్షణాల్లోనే అతను సాగూ తలపై బలమైన పిడిగుద్దు గుద్దాడు. దాడి తీవ్రతకు తట్టుకోలేకపోయిన సాగూ.. ఒక్కసారిగా అక్కడికక్కడే నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న అతడి స్నేహితురాలు వెంటనే అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. అలాగే సాగూ సోదరుడికి, అతడి భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇలా ఆయన ఆస్పత్రికి చేరుకుని.. సోదరుడిని చూశాడు. ఆపై నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరోవైపు ఆస్పత్రిలో చేరిన సాగూ పరిస్థితి రోజురోజుకూ విషమించింది. ఎంత ప్రయత్నించినా వెంటిలేటర్‌పై ఉంచినా ఆయన ఐదు రోజులకంటే ఎక్కువగా బతకలేకపోయారు. గత శుక్రవారం రోజు ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని కైల్ పాపిన్‌గా ఎడ్మంటన్ పోలీసులు గుర్తించారు. అతనిపై ఇప్పటికే తీవ్ర దాడి కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. హత్య కేసుగా మార్చి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.


మరోవైపు సాగూ సన్నిహితుడు విన్సెంట్ రామ్.. ఆయన పిల్లల భవిష్యత్తు, అంత్యక్రియల ఖర్చుల కోసం ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. "సాగూ చాలా మంచివాడు. ఆయన పిల్లలంటే అతడికి చాలా ఇష్టం. ఈ కష్టకాలంలో ఆయన పిల్లలకు అవసరమైన వనరులను, మద్దతును అందించడమే ఈ ఫండ్‌రైజర్ ముఖ్య ఉద్దేశం" అని విన్సెంట్ రామ్ తన సందేశంలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa