నకిలీ మద్యం తయారీ, పంపిణీ, అమ్మకాలపై రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే తాను వివరణ ఇచ్చానని, నకిలీ మద్యంతో తనకెలాంటి సంబంధం లేదని, ఏ విచారణకైనా తాను సిద్ధమని మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రానికి వెళ్లి అక్కడి పరిస్థితులను స్వయంగా చూశానని, ఆ దృశ్యాలను ప్రజల ముందుకు తెచ్చానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా నకిలీ మద్యం సరఫరాను నిలదీయడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. అయన మాట్లాడుతూ... రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరాను ప్రశ్నిస్తూ, నేను నివాసం ఉండే ఇబ్రహీంపట్నంలో ఆ మద్యం తయారీని లోకానికి చూపడం నేరమా? దాంతో నాపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్..ఇద్దరూ నా జీవితంతో పాటు, వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తున్నారు. ఇది అత్యంత దారుణం. హేయం. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నకిలీ మద్యం కేసును నాపై మోపే ప్రయత్నం చేస్తున్నారు. నేనెప్పుడూ అలా నకిలీ మద్యం తయారు చేయించ లేదు. అలాంటి పని నేనెప్పుడూ చేయను. చేయబోను. ఈ కేసులో వాస్తవాలు తేలాలంటే సీబీఐ దర్యాప్తు జరపాలి. మరి దానికి సీఎం చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa