ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌కు వ్యతిరేకంగా ఆఫ్గనిస్థాన్ నిర్మిస్తున్న డ్యామ్‌కు భారత్ మద్దతు

international |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 10:16 PM

దక్షిణాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరిహద్దుల నుంచి.. నీటి వనరుల వైపు మళ్లాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌తో సింధూ జలాల ఒప్పందంపై కఠిన వైఖరి తీసుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ కూడా అదే బాటలో నడుస్తోంది. పాకిస్తాన్‌లోకి ప్రవహించే ముఖ్యమైన నది అయిన కునార్ నదిపై వీలైనంత త్వరగా డ్యామ్ నిర్మించాలని తాలిబాన్ అధినేత మౌలవీ హిబతుల్లా అఖుంద్‌జాదా ఆదేశాలు జారీ చేశారు. ఇక జలవిద్యుత్ ప్రాజెక్టులతో సహా స్థిరమైన నీటి నిర్వహణ ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు.


భారత్ గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లో హెరత్ ప్రావిన్స్‌లో సల్మా ఆనకట్టను నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కునార్ డ్యామ్‌కు భారత్ మద్దతు ఇవ్వడం.. పాక్-ఆఫ్ఘాన్ వైరాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కునార్ నది కాబూల్ నదితో కలిసి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి జీవనాధారంగా ఉంటుంది. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల పాకిస్తాన్ దశాబ్దాల్లోనే అత్యంత తీవ్రమైన జల సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఈ డ్యామ్ నిర్మాణం కోసం విదేశీ కంపెనీల కోసం వేచి చూడకుండా.. దేశీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని వీలైనంత త్వరగా ప్రాజెక్టును ప్రారంభించాలని మంత్రి అబ్దుల్ లతీఫ్ మన్సూర్ ద్వారా తాలిబాన్ అధినేత ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ కునార్ నదీ జలాలు పాకిస్తాన్ వ్యవసాయానికి.. మరీ ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి అత్యంత కీలకంగా ఉన్నాయి. ఈ నదిపై ఆఫ్ఘనిస్తాన్ డ్యామ్ నిర్మిస్తే.. పాకిస్తాన్ ఇప్పటికే ఎదుర్కొంటున్న జల సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇక కునార్ నదిపై డ్యామ్ నిర్మాణ విషయంలో ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ పూర్తి సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటన సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనను ఆయన గుర్తు చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులతో సహా నీటి నిర్వహణ కోసం ఆఫ్ఘనిస్తాన్ చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.


ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరత్ ప్రావిన్స్‌లో సల్మా డ్యామ్‌ను భారత్‌ నిర్మించింది. ఇక కునార్ డ్యామ్ నిర్మాణంలో కూడా భారత్ సహకారం అందిస్తే.. అది 2 దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసి.. వ్యూహాత్మకంగా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచుతుందని భావిస్తున్నారు. కునార్ నది కాబూల్ నదితో కలిసి.. ఆ తర్వాత పాకిస్తాన్‌లోకి చిత్రాల్ నదిగా ప్రవేశిస్తుంది. చివరికి ఇది సింధూ నదిలో కలిసి.. అరేబియా సముద్రంలో కలుస్తుంది. కాబూల్ నదిలోకి చేరే నీటిలో ఎక్కువ భాగం పాకిస్తాన్‌ వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజా ఘర్షణలతో తమ నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తుండటంతో.. పాకిస్తాన్‌కు రానున్న రోజుల్లో నీటి సమస్య పెను సవాలుగా మారనుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa