ఒకవైపు భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ.. భారత్కు ఓ భారీ ఊరట లభించింది. భారత్-అమెరికాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారం సరికొత్త శిఖరాలను చేరుకునేలా కీలక డీల్ కుదిరింది. మలేసియాలో జరిగిన ఒక కీలక సమావేశంలో రెండు దేశాల మధ్య కొత్త 10 ఏళ్ల రక్షణ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. మలేసియా ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే రెండు దేశాల మధ్య రక్షణ ఫ్రేమ్వర్క్పై సంతకాలు చేశారు.
కీలక డీల్పై సంతకం చేసిన తర్వాత.. పీట్ హెగ్సెత్ ఎక్స్ వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజ్నాథ్ సింగ్తో కలిసి 10 ఏళ్ల అమెరికా-భారత్ రక్షణ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసినట్లు తెలిపారు. ఇది తమ రక్షణ భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ స్థిరత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని.. తాము సమన్వయం, సమాచార మార్పిడి, టెక్నాలజీ సహకారాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని పేర్కొ్న్నారు. భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం రక్షణ సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని వెల్లడించారు.
ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా భారత్లో రక్షణ తయారీని మరింత పెంచడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ఫ్రేమ్వర్క్కు ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన సమావేశంలో ఈ రక్షణ ఒప్పందానికి బీజం పడింది.
ఈ ఒప్పందం సందర్భంగా.. రాజ్నాథ్ సింగ్, హెగ్సెత్ తమ చర్చల్లో పలు కీలక అంశాలపై దృష్టి సారించారు. అమెరికా నుంచి భారత్కు రావాల్సిన ప్రధాన రక్షణ వస్తువుల విక్రయాలపై వేగవంతమైన నిర్ణయం తీసుకోవాలని చర్చించారు. తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్లకు కీలకమైన జీఈ ఏరోస్పేస్ ఎఫ్ 404 ఇంజిన్ల డెలివరీలో జరుగుతున్న జరుగుతున్న ఆలస్యాన్ని పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ ఆలస్యం కారణంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెలివరీ షెడ్యూళ్లకు ఆటంకం కలుగుతోందని తెలిపారు.
భారత్లోనే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, జీఈ ఏరోస్పేస్ సంయుక్తంగా ఎఫ్ 414 ఇంజిన్లను ఉత్పత్తి చేసే ప్రతిపాదిత ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని రాజ్నాథ్ సింగ్ హెగ్సెత్కు సూచించారు. ఈ సహకారం భారతదేశ స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచి.. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇటీవల అక్టోబర్ 27వ తేదీన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మలేసియాలోనే భేటీ అయ్యారు. ఇది భారత్, అమెరికా మధ్య నిరంతర దౌత్య, వ్యూహాత్మక సహకారాన్ని తెలియజేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa