ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మై డియర్ ఫ్రెండ్.. ఐ మిస్ యూ.. జగన్ ఎమోషనల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 06:26 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. తన మిత్రుడిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ జగన్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తెలుగు రాజకీయాల గురించి పరిచయం ఉన్నవారికి మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న వయసులోనే రాజకీయాలకు అతీతంగా మంచి పేరు తెచ్చుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి.. 2022లో హఠాన్మరణం చెందారు. మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి నేడు. ( నవంబర్ 2). ఇక మేకపాటి గౌతమ్ రెడ్డికి, వైఎస్ జగన్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి నేపథ్యంలో ఈ విషయాన్ని తలుచుకుని వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ చేశారు."నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి సందర్భంగా.. నేను ఆయన్ని మనసారా గుర్తు చేసుకుంటున్నా. ఐ మిస్‌ యూ గౌతమ్" అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.


నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 1971 సంవత్సరం నవంబర్ రెండో తేదీన మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, మణిమంజరి దంపతులకు మేకపాటి గౌతమ్ రెడ్డి జన్మించారు. మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ టెక్స్‌టైల్స్ పూర్తి చేశారు. అనంతరం కేఎంసీ సంస్థకు ఎండీగా పనిచేశారు. 2014లో మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున రాజకీయ రంగ ప్రవేశం చేశారు.


నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీచేసిన గౌతమ్ రెడ్డి .. తొలిసారే 30 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. అయితే నాటి ఎన్నికల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి రావటంతో ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌతమ్ రెడ్డి.. 20 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. అనంతరం వైఎస్ జగన్ మంత్రివర్గంలోపరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.


అయితే 2022లో ఏపీకి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా దుబాయ్ పర్యటనకు వెళ్లారు మేకపాటి గౌతమ్ రెడ్డి. దుబాయ్ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన ఒక్క రోజులోనే గుండెపోటుకు గురయ్యారు. 2022 ఫిబ్రవరి 21న హైదరాబాద్‌‌లోని తన నివాసంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా..డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా.. ఫలితం లేకపోయింది. 49 ఏళ్ల వయసులోనే మేకపాటి గౌతమ్ రెడ్డి అందరినీ వదిలి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మేకపాటి గౌతమ్ రెడ్డితో తనకుఉన్న అనుబంధాన్ని, ఆయన పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa