ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. గొప్ప స్థాయిలో ఉన్నారు. అలాంటప్పుడు ఆమె ప్రవర్తన ఎంత హుందాగా ఉండాలి. నలుగురికి మంచి చెడులు చెప్పాలి. కానీ ఆమె మాత్రం తన స్థాయి మర్చిపోయి.. దిగజారి ప్రవర్తించింది. తోటి ప్రయాణికురాలి పర్స్ దొంగతనం చేసింది. ఆమె ఘనకార్యం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే సదరు ఎంపీడీవో భార్య చేసిన తప్పును దాచే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు..
ఈ సంఘటన మూడు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్లో వెలుగు చూసింది. స్టాఫ్ నర్స్ ఒకరు విజయవాడ బస్టాండ్లో తన పర్స్ పోయింది అని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి.. సీసీటీవీ చెక్ చేయడంతో సదరు ఎంపీడీవో భార్య చేతి వాటం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన గత నెల అనగా అక్టోబర్ 29న చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలో పని చేస్తున్న ఓ ఎంపీడీఓ గుంటూరులో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె విజయవాడ బెంజ్ సర్కిల్లో ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. వీరంతా బుధవారం నాడు విజయవాడ వచ్చారు. తిరిగి మధ్యాహ్నం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో గుంటూరు బస్సులు ఆగే ప్లాట్ఫాం వద్దకు వచ్చారు.
అదే సమయంలో బాధిత స్టాఫ్ నర్స్ కూడా బస్ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంది. ఆమె దగ్గర ఉన్న పర్స్ మీద ఎంపీడీవో భార్య కన్ను పడింది. ఎలాగైనా దాన్ని కొట్టేయాలని భావించిన నిందితురాలు.. సదరు స్టాఫ్ నర్స్ని తోసుకుంటూ బస్ ఎక్కింది. ఈక్రమంలో పర్స్ కొట్టేసింది. ఆతర్వాత బస్ దిగి టాయిలెట్కి వెళ్లి వచ్చింది. వేరే బస్సులో వెళ్దామని భర్తను అడిగింది. అతడు వద్దని చెప్పి అదే బస్ ఎక్కించారు.
ఆ తర్వాత స్టాప్ నర్స్ గుంటూరులో బస్ దిగి.. బ్యాగ్ చెక్ చేసుకోగా.. ఆమె పర్స్ కనిపించలేదు. దీంతో అక్టోబర్ 30న కృష్ణలంక పోలీసు స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గుంటూరు బస్టాండ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. సదరు ఎంపీడీవో భార్య.. అదే పనిగా నర్స్ చేతిలో ఉన్న బ్యాగ్ను పరిశీలిస్తుండటాన్ని గమనించారు. ఎంపీడీవో కుమార్తె ధరించిన యూనిఫామ్ ఆధారంగా కాలేజీకి వెళ్లి విచారించారు. ఆమె ఫొటో చూపించగానే.. నిందితుల అడ్రెస్ తెలిసింది.
దీంతో పోలీసులు శుక్రవారం నాడు గుంటూరు వెళ్లి ఎంపీడీవో కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆమె చేతి వాటం బయటపడింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. బాధితురాలు పర్సులో 14 గ్రాముల బంగారం, రూ.5వేలు ఉండగా.. ఫిర్యాదులో మాత్రం 4 కాసుల బంగారం, రూ.35 వేలు ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa