ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశీబుగ్గ బాధితులకు పరిహారం అందించిన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 06:35 PM

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ విజయ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం అందజేసింది. శనివారం జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించారు. వీరిలో ఎనిమిది మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. శనివారం సాయంత్రం ఘటనాస్థలిని నారా లోకేష్ పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం చనిపోయిన వారి కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షలు చొప్పున ప్రభుత్వం తరుఫున నారా లోకేష్ పరిహారం ప్రకటించారు. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని బుధవారం అందజేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బాధిత కుటుంబాలకు ఈ పరిహారం అందించారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందని. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


మరోవైపు కార్తీక ఏకాదశి కావటంతో శనివారం రోజున కాశీబుగ్గ విజయ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎప్పుడూ 2 వేల మంది వరకూ వచ్చే భక్తులు శనివారం రోజున ఏకంగా 15 వేల మంది వరకూ వచ్చారు. దీంతో భక్తుల మధ్య తొలుత తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే అది తొక్కిసలాటకు దారితీయడం, రెయిలింగ్ విరిగిపడటంతో 9 మంది చనిపోయారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు పలు కారణాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.


నిర్వహణ లోపం, భక్తుల భద్రతను పట్టించుకోకపోవటం ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు.ఆలయంలో భక్తుల రాకపోకలకు ఒకే మార్గాన్ని ఉపయోగించడం, భక్తుల రద్దీకి అనుగుణంగా బారీకేడ్లు ఏర్పాటు చేయకపోవటం, భక్తులు, క్యూలైన్ల నిర్వహణకు భద్రతా సిబ్బంది, వాలంటీర్లు లేకపోవటం కూడా కారణాలుగా భావిస్తున్నారు. దీనికి తోడు భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి.


 మరోవైపు కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని హరిముకుంద్ పండా నిర్మించారు. తన సొంత డబ్బులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. రైల్వేస్టేషన్, బస్టాండ్లకు ఈ ఆలయం దగ్గరగా ఉండటంతో పాటుగా.. సోషల్ మీడియా ప్రచారం కూడా కారణంగా తెలుస్తోంది. మనకు దగ్గరలోనే తిరుపతి తరహా ఆలయం అంటూ ప్రచారం చేయడం.. రోజుకు 2 వేల మంది వరకు భక్తులు వస్తుంటారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావటంతో పాటుగా కార్తీక ఏకాదశి రోజు మంచి రోజు కావటంతో ఎక్కువ మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో నిర్వహణ సరిగా లేక తీవ్ర విషాదం చోటుచేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa