చిన్న చిన్న వివాదాలకే ఆవేశంతో రగిలిపోతున్నారు. అయినవారు, పరాయి వారు అని తేడా లేకుండా కత్తిగడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు వరుసగా పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా అలాంటి ఘటన చోటుచేసుకుంది. చిన్న అసమ్మతి.. చంపే వరకు వెళ్లింది. బెంగళూరులోని ఓ ఆఫీసులో లైట్లు ఆఫ్ చెయ్ అన్నందుకు.. మేనేజర్ను చంపేశాడు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇదీ జరిగింది..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగళూరు గోవిందరాజ్నగర్లోని MC లేఅవుట్ సమీపంలో ఉన్న డిజిటల్ వాల్ట్ అనే ఫోటో-ఎడిటింగ్ సంస్థలో.. భీమేష్ బాబు అనే 41 ఏళ్ల వ్యక్తి మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే ప్రకాశవంతమైన కాంతి భీమేష్ బాబుకు పడదు. అలాంటి కాంతికి బాబు సున్నితంగా ఉంటాడు. అయితే ఆఫీస్లో అనవసరమైన లైట్లు ఆపివేయమని తరచుగా సహోద్యోగులను కోరేవాడు.
ఆదివారం (నవంబర్ 2) అర్ధరాత్రి ఒంటి గంట సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ సోమల వంశీ (24) వీడియోలు ఎడిట్ చేస్తున్నాడు. ఆ సమయంలో బాబు.. అతడిని లైట్లు ఆఫ్ చేయాలని చెప్పాడు. దీంతో కోపద్రిక్తుడైన వంశీ.. బాబుతో వాగ్వాదానికి దిగాడు. మాటల యుద్ధం కాస్త మరో స్థాయికి వెళ్లింది. కోపంతో ఊగిపోయిన వంశీ బాబుపై కారం పొడి చల్లాడు. తర్వాత ఇనుప డంబెల్తో తల, ముఖం, ఛాతీపై పలుసార్లు కొట్టాడు. బాబు కుప్పకూలిపోవడంతో.. భయాందోళనకు గురైన వంశీ.. నాయందహళ్లిలో ఉన్న తన సహోద్యోగి గౌరీ ప్రసాద్ను కలవడానికి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. జరిగిన విషయం తెలుసుకున్న ప్రసాద్.. అతడి స్నేహితుడి సహాయం కోరాడు. అనంతరం ఆ ముగ్గురూ ఆఫీసుకు తిరిగి వచ్చారు.
మేనేజర్ బాబు కదలకుండా ఉండటం చూసి.. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. అయితే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. అప్పటికే బాబు చనిపోయాడని ప్రకటించారు. ఈ ఘటన తర్వాత నిందితుడు వంశీ.. గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అనతంరం అతడిపై హత్య నేరం కింద కేసు నమోదైంది.
లైట్లు ఆఫ్ చేయాలనే విషయంపై వివాదం తలెత్తి.. హత్యకు దారితీసిందని డీసీ (వెస్ట్) గిరీష్ ఎస్ ధ్రువీకరించారు. హత్యకు దారితీసిని ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కాగా ఇటీవల బెంగళూరులోనే ఇలాంటి ఓ ఘటన జరిగింది. కారు మిర్రర్ను బైక్తో డ్యాష్ ఇచ్చినందుకు.. ఓ యువకుడిని కారుతో వెంబడించి మరీ గుద్ది చంపారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిన దంపతులను సీసీటీవీలు పట్టించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa