ప్రాణాలు పోయాల్సిన అంబులెన్స్.. ఓ జంట పాలిట మృత్యు దేవతగా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ దాటి, అదుపుతప్పి అక్కడ నిలిచి ఉన్న పలు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తోన్న ఓ జంట తీవ్రంగా గాయపడి మృతిచెందింది. విషాదకర ఈ ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. నవంబరు 1 శనివారం రాత్రి 11 గంటల సమయంలో రిచ్మండ్ సర్కిల్ వద్ద అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. సర్కిల్ వద్ద సిగ్నల్ ఉండటంతో పలువురు తమ వాహనాలను ఆపేశారు.
ఈ సమయంలో వేగంగా వచ్చిన అంబులెన్స్ వాటిని ఢీకొట్టింది. మూడు బైక్లను ఢీకొట్టి, వాటిలో ఒకదానిని కొద్ది మీటర్లు దూరం ఈడ్చుకెళ్లి పోలీస్ ఔట్పోస్ట్ ఢీకొని నిలిచిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. కొద్దిసేపటికే భర్త.. ఆదివారం తెల్లవారుజామున భార్య ప్రాణాలు కోల్పోయారు. దంపతులను ఇస్మాయిల్ దబాపు (32), అతడి భార్య సమీనా బానుగా (29) గుర్తించారు. అలాగే, మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసు ఔట్పోస్ట్పైకి దూసుకెళ్లిన అంబులెన్స్ను ఎత్తిపడేశారు. ఈ ఘటన అనంతరం డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు.
ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియోలో వాహనాన్ని స్థానికులు పైకి ఎత్తిపడేయడం కనిపించింది. ఈ నేపథ్యంలో అంబులెన్స్ దాడిలో దెబ్బతిన్న బైక్లు, పోలీస్ ఔట్ పోస్ట్ కనిపిస్తున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదుచేసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ నుంచి పారిపోయిన అంబులెన్స్ డ్రైవర్ అశోక్ను అదుపులోకి తీసుకున్నారు. అతివేగంతో పాటు నిర్లక్ష్యంగా వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. కాగా, దీనికి రెండు రోజుల కిందటే ఓ దంపతులు తమ కారు పక్క నుంచి వెళ్తూ అద్దం పగులగొట్టాడని ఆగ్రహంతో బైక్పై వెళ్తోన్న యువకుడ్ని ఢీకొట్టి ప్రాణాలు తీసిన ఘటన చోటుచేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa