ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హే బాబూ.. ఎక్స్‌ట్రీమిస్ట్ అనే పదాన్ని ఇంగ్లీషులో రాసి చూపించు': తేజస్వీ యాదవ్‌కు ఒవైసీ ప్రశ్న

national |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 08:31 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో.. ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను 'అతివాది' (ఎక్స్‌ట్రీమిస్ట్) అని పిలిచిన తేజస్వీ.. ఆ పదాన్ని 'పాకిస్థాన్ నుంచి తెచ్చుకున్నారా" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. తేజస్వీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "హే బాబూ, 'ఎక్స్‌ట్రీమిస్ట్'ని ఒక్కసారి ఇంగ్లీషులో రాసి చూపించు" అంటూ ఎద్దేవా చేశారు.


కిషన్‌గంజ్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఒవైసీ ప్రసంగిస్తూ.. 2025 ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు కోసం ఏఐఎంఐఎం ప్రయత్నించినప్పుడు.. ఒక ఇంటర్వ్యూలో తేజస్వీ తనను 'అతివాది, మత పిచ్చి, టెర్రరిస్ట్' అని పేర్కొన్నారని తెలిపారు. తన గడ్డం, టోపీ చూసి అతివాది అని తేజస్వీ మాట్లాడటం సీమాంచల్ ప్రజలను అవమానించడమేనని ఒవైసీ మండిపడ్డారు. "ఎవరు నీ ముందు తలవంచరో, భయపడరో, నీ తండ్రి (లాలూ ప్రసాద్ యాదవ్)కి భయపడకుండా ఉంటారో... వారిని పిరికివాడంటావా?" అని ఒవైసీ నిలదీశారు.


తేజస్వీపై ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. "తేజస్వీ యాదవ్ మాట్లాడుతున్నది పాకిస్థాన్ భాష" అని ప్రకటించారు. ఆయన మతాన్ని గర్వంగా అనుసరించడం వల్లే తేజస్వీ తనను అతివాదిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. కాగా ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ఒవైసీ చేసిన పొత్తు ప్రతిపాదనపై స్పందించకపోవడంతో.. ఏఐఎంఐఎం రాష్ట్రంలోని 243 స్థానాల్లో 100 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు, తేజస్వీ యాదవ్‌కు తాను స్వయంగా లేఖ రాసినా వారి నుంచి స్పందన రాలేదని ఒవైసీ తెలిపారు. అందుకే బీహార్‌లో తమ ఉనికిని విస్తరించుకోవడానికి సిద్ధం అవుతున్నామని.. తమ పార్టీ ఇతర 'సమాన మనస్కులున్న పార్టీలతో' కలిసి మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా చర్చలు జరుపుతోందని వెల్లడించారు.


ముస్లిం-యాదవ్ (MY) ఫార్ములాను నమ్ముకున్న ఆర్జేడీకి ముస్లిం ఓటు బ్యాంకులో చీలిక వస్తుందనే భయంతోనే తేజస్వీ.. ఒవైసీని దూరం పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2022 బీహార్ కుల గణన ప్రకారం.. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 17.7 శాతంగా ఉన్నారు. ఈ కీలకమైన ఓటు బ్యాంకులో తమ నాయకుడిని స్థాపించుకోవాలని ఒవైసీ ప్రయత్నిస్తున్నారు. 2020 ఎన్నికల్లో ఏఐఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలోని 5 స్థానాలను గెలుచుకుంది. అయితే అందులో నలుగురు ఎమ్మెల్యేలు తర్వాత ఆర్జేడీలోకి మారారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని.. ఆర్జేడీ అధినేత ఏఐఎంఐఎంను పెద్ద ముప్పుగా భావించడం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఒవైసీ చేస్తున్న తీవ్ర విమర్శలు, ఆయన సొంతంగా పోటీ చేయడం అనేది బీహార్‌లోని తేజస్వీ, నితీష్ కుమార్ వర్గాల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa