ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వీడియోలు తీసి పంపండి.. ఒక్క వీడియోకి రూ.250 పొందండి!

national |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 08:32 PM

మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. మీరు ఏ పనీ చేయకపోయినా, చేసినా ఆ వీడియోలు తీసి పంపిస్తే చాలు డబ్బులు సంపాదించేయొచ్చు. అలా అని వేలకు వేలు వస్తాయని అనుకోకండి.. ఒక్క వీడియోకు రూ.250 మాత్రమే. కానీ మీరు ఓ పది వీడియోలు కనుక తీసి పంపారంటే రూ.2500 వరకు సంపాదించుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ అసలేం వీడియోలు తీయాలి, ఆ వీడియోలను ఎవరికి పంపాలనే కదా మీ డౌటానుమానం.. అదే చెబుతున్నానండీ.. ఎవరైనా చెత్త రోడ్లపై పడేస్తూ కనిపించారంటే వీడియో తీయాలి. దాన్ని మున్సిపల్ అధికారులకు పంపించాలి. వాళ్లే మీకు ఒక్క వీడియోకు గాను రూ.250 అందిస్తారు.


దేశంలోని ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరు నగరంలో చెత్త సమస్యకు అడ్డుకట్ట వేయడానికి గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో.. రోడ్లపై అడ్డగోలుగా చెత్త పారవేసేవారిని వీడియోగా తీసి అధికారులకు పంపిస్తే రూ.250 రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా చెత్త వేసేవారికి గట్టి హెచ్చరిక పంపాలని జీబీఏ లక్ష్యంగా పెట్టుకుంది.


  బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (BSWML) ఆధ్వర్యంలో ఈ 'వీడియో రివార్డు' పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకే ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. వీడియోలు పంపడానికి వీలుగా త్వరలోనే ఒక ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను అందుబాటులోకి తేనున్నారు. అంతేకాకుండా పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం కోసం ఒక మొబైల్ యాప్‌ను కూడా వారం రోజుల్లోగా అభివృద్ధి చేసి విడుదల చేయనున్నట్లు BSWML వర్గాలు వెల్లడించాయి.


BSWML చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరిగౌడ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో దాదాపు 5,000 ఆటోలు ప్రతి ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరిస్తున్నప్పటికీ.. కొందరు ప్రజలు ఇప్పటికీ రోడ్లపైనే చెత్త పారవేస్తున్నారని తెలిపారు. "ఇది ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఒక రకమైన 'రిటర్న్ గిఫ్ట్' వంటిది" అని ఆయన పేర్కొన్నారు. ఈ రివార్డు పథకం.. గత వారం జీబీఏ ప్రారంభించిన 'గార్బేజ్ డంపింగ్ ఫెస్టివల్'కు కొనసాగింపుగా రావడం గమనార్హం. గత వారం ప్రవేశపెట్టిన ఆ పథకంలో.. రోడ్లపై చెత్త వేసేవారిని గుర్తించి, ఆ చెత్తను తిరిగి వారి ఇంటి ముందే కుప్పగా పోయడం ద్వారా వారికి తగిన గుణపాఠం చెప్పాలని అధికారులు నిర్ణయించారు.


కొత్త నిబంధనల ప్రకారం.. రోడ్లపై చెత్త పారవేసినట్లు వీడియో సాక్ష్యంతో సహా పట్టుబడిన వారికి రూ.2,000 వరకు జరిమానా విధిస్తారు. జరిమానాతో పాటు వారు రోడ్డుపై పారవేసిన చెత్తను తిరిగి వారి ఇంటి వద్దకు తీసుకెళ్లి పోస్తారు. నగరంలో ఇప్పటికే సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా ఉంచడంతో పాటు ప్రజల నుంచి వస్తున్న వీడియోలను కూడా అధికారులు ఉపయోగిస్తున్నారు. చూడాలి మరి ఇప్పుడు తీసుకు వచ్చిన కొత్త రివార్డు పథకం ద్వారానైనా పూర్తిగా బెంగళూరును స్వచ్ఛంగా మార్చగలరా లేదా అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa