ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేవెళ్ల విషాదం.. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌పై ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుసా

Crime |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 08:53 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మరణించడంపై తీవ్ర విషాదం నెలకొంది. తొలుత 19 మంది మరణించినట్లు పోలీసులు నిర్ధారించినప్పటికీ.. ఆ తర్వాత ఆ సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ గతంలోనే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు వెల్లడైంది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ (TG06T3879) పై పోలీసులు ఇదివరకే రెండు చలాన్లు విధించారు. ఈ వాహనం ఉదిత్య అనిత పేరుతో రిజిస్టర్ అయింది.


సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ టిప్పర్‌పై రూ. 3,270 జరిమానా విధించారు. అక్రమంగా.. నిషేధిత సమయాల్లో భారీ లోడ్‌తో నగరంలోకి ప్రవేశించినందుకు చందానగర్, ఆర్సీ పురం పరిధిలో ఫిబ్రవరి, సెప్టెంబర్ నెలల్లో హైదరాబాద్ పోలీసులు ఈ జరిమానా వేశారు. ఈ చలాన్లు ఉన్నప్పటికీ, వాహనాన్ని యథావిధిగా నడపడం నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. పటాన్‌చెరు క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్, రాంగ్ రూట్‌లో, అతివేగంతో వచ్చి తాండూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.


ఆ సమయంలో సుమారు 72 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. టిప్పర్ డ్రైవర్‌తో పాటు బస్సు డ్రైవర్, 8 మంది పురుషులు, 13 మంది మహిళలు, ఒక చిన్నారి ఈ ప్రమాదంలో మరణించారు. మరణించిన టిప్పర్ డ్రైవర్‌ను మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆకాష్ కాంబ్లేగా గుర్తించారు.


అతను మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదంపై బస్సు కండక్టర్ రాధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. చేవెళ్ల పోలీసులు టిప్పర్ డ్రైవర్ ఆకాష్‌పై 106(1) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి ముందు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా అనే కోణంలో విచారణ కోసం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. గాయపడిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa