ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలబద్ధక నివారణకు మూడు సింపుల్ చిట్కాలు

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 10:34 PM

మీరు ప్రతి ఉదయం బాత్రూమ్‌కి వెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారా? మీరు మలవిసర్జన చేయడానికి నానా తంటాలు పడుతున్నారా? అయితే, మీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్టే. ఈ సమస్య ఉంటే పేగులు సరిగ్గా క్లీన్ అవ్వవు. అంతేకాకుండా పొట్టలో చెడు అంతా పేరుకుపోతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలా మందికి నెలల తరబడి ఈ సమస్య ఉంటుంది. అయితే, దీన్ని చాలా మంది లైట్ తీసుకుంటారు.మీకు అస్సలు మూత్ర విసర్జన చేయాలని అనిపించకపోతే.. మీరు కూడా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే వెళితే, ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి.


లేదంటే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్య దీర్ఘకాలికంగా మారితే పైల్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. తక్కువ ఫైబర్ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మలబద్ధకంతో పాటు ఇతర జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఆధునిక జీవనశైలి, తిండి అలవాట్లు, ఒత్తిడి, ఒకే చోట గంటల తరబడి కూర్చొని పనిచేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ హార్వర్డ్ డాక్టర్ సౌరబ్ సేథీ మూడు సింపుల్ చిట్కాలు చెప్పారు. వీటిని రోజూ పాటిస్తే మలబద్దకం సమస్య తగ్గి.. మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


మలబద్ధకానికి కారణమయ్యే ఒక సాధారణ తప్పు


డాక్టర్ సేథి ప్రకారం, చాలా మందిలో ఒక సాధారణ టాయిలెట్ అలవాటు మలబద్ధకానికి కారణమవుతోంది. అది ఏంటంటే టాయిలెట్‌లో కూర్చోనే పొజిషన్. ఈ రోజుల్లో చాలా మంది తమ ఇళ్లల్లో వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నారు. వెస్ట్రన్ టాయిలెట్‌లోని సాధారణ సీటింగ్ పొజిషన్ చాలా మందిలో మలబద్ధకానికి కారణమవుతుంది. ​


పాదాలను నేలపై ఉంచి కూర్చున్నప్పుడు.. శరీరం పేగుల్ని సులభంగా ఖాళీ చేయడానికి సరైన స్థితిలో ఉండదు. మీ పురీషనాళంలో ఒక వంపు ఉంటుంది. ఇలా కూర్చోవడం వల్ల మలవిసర్జన చేయడం కష్టతరం అవుతుందని డాక్టర్ వివరించారు.


ఎలా పరిష్కరించాలి?


ఈ సమస్యను పరిష్కరించడానికి డాక్టర్ సేథీ సింపుల్ చిట్కా చెప్పారు. ఇందుకోసం టాయిలెట్‌లో ఉన్నప్పుడు మీ పాదాల కింద ఒక చిన్న స్టూల్ ఉంచండి. మోకాళ్లను తుంటిపైన పైకి లేపండి. ఇది వంపును నిఠారుగా చేస్తుంది. దీంతో మలం సులభంగా కదులుతుందని డాక్టర్ చెప్పారు. ఎలా కూర్చోవాలో తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో షేర్ చేశారు. ఇది కేవలం వెస్ట్రన్ టాయిలెట్ వాడేవారికి మాత్రమే. సాధారణ భారత టాయిలెట్స్ వాడేవారికి ఇది అవసరం లేదని డాక్టర్ చెబుతున్నారు.


చిట్కాలు


నీరు తాగడం


ఈ రోజుల్లో చాలా మంది నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. రోజూ శరీరానికి తగినంత నీరు అందకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్యల్లో మలబద్ధకం ముందుంటుందని డాక్టర్ చెప్పారు. అందుకే తగినంత నీరు తాగాలని ఆయన సూచిస్తున్నారు.


రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని సేథీ అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల పేగుల్లో మలం కదిలిక సులువుగా ఉంటుందని ఆయన చెప్పారు. దీంతో మలవిసర్జన సాఫీగా జరుగుతుందని ఆయన చెబుతున్నారు.


వ్యాయామం


ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది శారీరక శ్రమకి దూరంగా ఉంటున్నారు. దీని కారణంగా గంటల తరబడి ఒకే ప్రదేశంలో కూర్చొని పనిచేస్తున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మలబద్ధకం కూడా ఇందులో ఒకటి. మలబద్ధకం తగ్గించుకోవడానికి శారీరక శ్రమ అంటే వ్యాయామం తప్పనిసరి అని అంటున్నారు డాక్టర్.


ఇందుకోసం ప్రతి రోజూ కనీసం ముప్పై నిమిషాలైనా వ్యాయామం చేయాలని డాక్టర్ అంటున్నారు. వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్లైకింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గిపోతుందని ఆయన వివరించారు.


ఈ మూడు పండ్లు తినాలి


డాక్టర్ సేథీ ఇంకో వీడియోలో మలబద్ధకం తగ్గించే మూడు పండ్లు గురించి చెప్పారు. ఈ పండ్లు రోజూ తింటే మలబద్ధకం తగ్గుతుందని ఆయన వివరించారు. కివీ, అరటిపండు, బొప్పాయి వంటి మూడు పండ్లు తినాలని ఆయన సలహా ఇచ్చారు.


ఫైబర్ అధికంగా ఉండే కివీ పండులో ఆక్టినైడ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పేగు కదలికల్ని నియంత్రించడంలో సాయపడుతుంది. దీన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా ఉంటుంది. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కివిలు తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.


అరటిపండు, బొప్పాయి ఏం తక్కువ కాదు


* అరటిపండ్లు ఏడాది పొడవునా లభించే చవకైన పండు. రోజూ రెండు అరటిపండ్లు తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అరటిపండ్లు మలబద్ధకాన్ని మాత్రమే కాకుండా విరేచనాలను కూడా నయం చేస్తాయి. అరటిపండ్లు విరేచనాలకు నివారణ అని డాక్టర్ సేథి వివరించారు. అరటిపండ్లు పెక్టిన్ కలిగి ఉంటాయి. ఇది కరిగే ఫైబర్. దీని వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతుందని ఆయన చెప్పారు.


* మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను నియంత్రించడానికి బొప్పాయి మంచి ఆప్షన్ అంటున్నారు డాక్టర్ సేథీ. బొప్పాయి జీర్ణ ఎంజైమ్‌ల్నిపెంచుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ ఎంజైమ్‌లు అవసరమైన వారికి ఈ పండు ఒక అద్భుతమైన ఎంపిక అని డాక్టర్ సేథి వివరిస్తున్నారు. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రోటీన్ జీర్ణం చేయడంలో సాయపడుతుంది. దీంతో మలబద్ధకంతో బాధపడేవారికి బొప్పాయి మేలు చేస్తుందని డాక్టర్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa