ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క ఓటు తొలగించినా.. మీ అంతు చూస్తాం..దీదీ వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 07:23 PM

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్‌ నిర్వహించడంపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండో దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ రెండో దశను నిర్వహించనున్నట్లు తెలిపింది. అందులో.. ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, రాజస్థాన్.. రాష్ట్రాలతోపాటు అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. అయితే దీన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రోడ్డెక్కి.. ఎస్ఐఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు మంగళవారం (నవంబర్ 4) జరిగిన నిరసనలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వం వహించారు. కోల్‌కతా వీధుల్లో నిర్వహించిన భారీ ర్యాలీలో మమత పాల్గొన్నారు. ఈ ఎస్ఐఆర్‌ను.. బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కై చేస్తున్న నిశ్శబ్ధ రిగ్గింగ్‌గా అభివర్ణించారు. అంతేకాకుండా బిహార్‌లో ఎంతమంది రోహింగ్యాలు, బంగ్లాదేశీల వివరాలు లభించాయో ఎన్నికల సంఘం చెప్పాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన ఒక్క ఓటర్‌ని అయినా ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తే.. బీజేపీ ప్రభుత్వం పతనం అయ్యేలా టీఎంసీ చూస్తుందని మమత హెచ్చరించారు.


ఎస్ఐఆర్ భయంతో ఏడుగురు చనిపోయారు..


ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ కూడా నిరసనలో పాల్గొన్నారు. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర కొనసాగిన మార్చ్‌లో.. దారులన్నీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయాయి. ఈ క్రమంలో అభిషేక్ బెనర్జీ బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ఎస్ఐఆర్ భయంతో గడిచిన ఏడు రోజుల్లో ఏడుగురు మృతిచెందారని చెప్పారు. చనిపోయిన వారి కోసం ప్రజలంతా వీధుల్లోకి రావాలని.. ఢిల్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఢిల్లీలో భారీ నిరసనలకు మోదీ సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. అందరూ దీనికోసం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వచ్చే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. టీఎంసీ గెలవడానికో, మమతను నాలుగోసారి సీఎం చేయడానికో కాదని.. బీజేపీకి సున్నా సీట్లు వచ్చేలా చేయడమేన్నారు.


కాగా, అధికార పక్షం చేస్తున్న నిరసనలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. భారత రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా టీఎంసీ వ్యవహరిస్తోందని ఘాటుగా విమర్శించింది. మమతా బెనర్జీ ఎస్ఐఆర్ ప్రక్రియలో లోపాలను ఎత్తి చూపాలనుకుంటే.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని హితవు పలికింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa