ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం నా బెంచ్‌ను తప్పించుకోవాలని భావిస్తోంది.. సీజేఐ

national |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 07:24 PM

ట్రైబ్యునల్ రిఫామ్స్ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ కొనసాగుతోన్న మధ్యలో కేంద్రం అభ్యర్థించడం గమనార్హం. నవంబరు 3న సోమవారం పిటిషనర్ల వాదనలు పూర్తయ్యాక, అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో పాల్గొనడానికి వీలుగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోరడంతో జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలో ఐదుగురు జడ్జిల బెంచ్‌కు బదిలీ చేయాలని ఏజీ అభ్యర్థించారు. దీంతో షాకైన న్యాయమూర్తులు.. ‘ప్రస్తుత బెంచ్‌ను తప్పించుకోవాలనే రీతిలో కేంద్రం ఉన్నట్టుంది’ అని వ్యాఖ్యానించారు.


‘‘కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వైఖరి అవలంభిస్తుందని, న్యాయస్థానంతో ఇటువంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని మేము ఊహించలేదు..’’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరో 20 రోజుల్లోనే జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే. ‘‘మేము పిటిషనర్ల తరఫు లాయర్ల వాదనలు పూర్తిస్థాయిలో విన్నాం.. వాదనలు పూర్తయిన తరువాత ఏ ఒక్కసారి కూడా అటార్నీ జనరల్ ‘కేంద్ర ప్రభుత్వం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ అంశం రిఫర్‌ చేయమందని కోరలేదు’’ అని పేర్కొన్నారు. ‘కానీ, మేము ఈ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం.. అలాగే, ప్రస్తుత ధర్మాసనాన్ని కేంద్రం తప్పించుకునే ఉద్దేశంలో ఉంది ఎందుకంటే మరికొద్ది రోజుల్లో సీజేఐ పదవీకాలం ముగియనుంది’ అని జస్టిస్ గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.


ఈ సందర్భంగా అటార్నీ జనరల్ జోక్యం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం అదికాదని, అభ్యర్థనను అంగీకరించాలని కోరారు. కానీ, సీజేఐ బెంచ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అభ్యర్థనను అనుమతించమని తేల్చిచెప్పింది. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ట్రిక్కులు ప్లే చేస్తుందని మేము ఊహించలేదని వ్యాఖ్యానించింది. ‘వాదనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ అంశం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సిఫార్సు చేయాల్సిన చట్టపరమైన అర్హత ఉందని నిర్ణయానికి వస్తే మేము అలా చేస్తాం’ అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. తమ ధర్మాసనం వద్ద ఈ కేసు విచారణ జరగకూడదని కోరుకున్నట్టు ఉందని అభిప్రాయపడ్డారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa