పాకిస్థాన్ ఆర్మీపై సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, తమ సైన్యాన్ని అవినీతిలో కూరుకుపోయిన కిరాయి మాఫియాతో పోల్చుతూ పాక్ నేత దుయ్యబట్టారు. జే సింధ్ ముత్తహిదా మహాజ్ గ్రూప్ అధ్యక్షుడు షఫీ బుర్ఫాత్ తమ సైన్యం డబ్బుల కోసం అమ్ముడుపోతుందని, ఎవరినైనా మోసం చేస్తుందని సంచలన వ్యాఖ్యలు ఛేశారు. మొత్తంగా సైన్యం ఓ అవినీతి కిరాయి మాఫియా అని ఆరోపించారు. డాలర్ల కోసం విధేయతను నటిస్తుందని, లాభం కోసం అమెరికా, ఇతర ప్రపంచ శక్తులను ఏ క్షణంలోనైనా మోసం చేస్తుందని బుర్ఫాత్ ధ్వజమెత్తారు. ప్రచ్ఛన్న యుద్ధం నుంచి, ఉగ్రవాదంపై పోరు వరకు దశాబ్దాలుగా పాకిస్థాన్ సైన్యం అవకాశవాదాన్ని తన వ్యూహంగా మార్చుకుందని మండిపడ్డారు. మన సైన్యానికి ఎప్పుడూ న్యాయం, విశ్వాసం, భావజాలం గురించి పోరాడిన దాఖలాలు లేవని, దాని తాపత్రయం అంతా కేవలం లాభాల కోసమేనని ఆయన తూర్పారబట్టారు.
సోవియట్- అఫ్గన్ యుద్ధం సమయంలోనూ పశ్చిమ దేశాల సహాయం పొందడానికి మాత్రమే పాక్ తనను తాను జిహాద్ సంరక్షకుడిగా ప్రచారం చేసుకుందని షఫీ విమర్శించారు. 9/11 దాడులు తర్వాత ఉగ్రవాదంపై అమెరికా చేపట్టిన పోరాటంలో చేతులు కలిపినట్టు నటిస్తూ ఆ దాడులకు కుట్ర పన్నిన అల్ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్కు పాకిస్థాన్ ఆశ్రయమిచ్చిందని ఆరోపించారు. ఇలా ప్రభుత్వం, సైన్యం దశాబ్దాలుగా అమెరికా సహా ప్రపంచ దేశాలను మోసం చేస్తోందని ఆగ్రహించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద భయం ఎంత ఎక్కువగా ఉంటే.. పాకిస్థాన్ జనరల్స్ అంత ఎక్కువగా డాలర్లు సంపాదిస్తారు’’ అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
ఇదే సమయంలో పాక్ ప్రస్తుత విదేశాంగ విధానంపై కూడా షఫీ బుర్ఫారీ విరుచుకుపడ్డారు. చైనా, అమెరికా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్తో వంటి దేశాలతో విరుద్ధమైన పొత్తులను ఉదహరిస్తూ.. పాకిస్థాన్ విదేశాంగ విధానం విశ్వాసపాత్రమైన వేలం యుద్ధంగా మారిందని ఆయన ఆరోపించారు. చైనా ఎక్కువ డబ్బులిస్తే.. అమెరికాకు ద్రోహం చేస్తుందని, వాషింగ్టన్ ఎక్కువ మొత్తం ఇస్తే బీజింగ్ను అంతే సులభంగా మోసం చేస్తుందని బుర్ఫాత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ పైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మునీర్ను ఒక నకిలీ ఫీల్డ్ మార్షల్గా అభివర్ణిస్తూ.. తుప్పుబట్టిన సిద్ధాంతాలను ఇప్పటికీ అనుసరిస్తున్నారని జే సింధ్ నేత దుయ్యబట్టారు. మునీర్ నేతృత్వంలోని పాక్ సైన్యం ఇప్పటికే నాగరిక ప్రపంచం గౌరవాన్ని కోల్పోయిందని ఆరోపించారు. ‘అఫ్గనిస్థాన్, కశ్మీర్, పశ్చిమాసియాలోని అశాంతి, కలహాల మీద ఆధారపడుతుంది.. అదే సమయంలో తన దేశంలోని జాతి ఉద్యమాలను అణచివేస్తుంది. విశ్వాసం, నిబద్దతను డబ్బు కోసం అమ్ముకునేవాళ్లను ఏ దేశం నమ్మదు’ అని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa