మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ఒక రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారంగా కేవలం రూ.2.30 మాత్రమే లభించడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. వాస్తవానికి రైతుకు రూ.1.5 లక్షలకు పైగా పంట బీమా పరిహారం రావాల్సి ఉన్నా.. ఇంత తక్కువ మొత్తం జమ కావడంతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
పాల్ఘర్ జిల్లా వాడ తాలూకా శిలోత్తర్ గ్రామానికి చెందిన రైతు మధుకర్ బాబూరావు పాటిల్ ఈ దయనీయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆగ్రో అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన రసీదు ప్రకారం.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పాటిల్ తన 2.51 హెక్టార్ల భూమికి రూ.1,53,110 పరిహారం పొందడానికి అర్హులు. ఇందుకోసం ఆయన ఈ ఏడాది రూ.1,148.32 ప్రీమియం కూడా చెల్లించారు. కానీ శుక్రవారం పాటిల్కు వచ్చిన సందేశంలో కేవలం రూ.2.30 మాత్రమే తన ఖాతాలో జమ అయినట్లు చూపింది.
తనకున్న ఆరు నుంచి ఏడు ఎకరాల్లోని వరి పంట నిరంతర వర్షాల కారణంగా పూర్తిగా నీటమునిగి కుళ్లిపోయిందని పాటిల్ ఆవేదన వ్యక్తం చేశారు. "మా పంట మొత్తం పోయింది. మాకు మద్దతు ఇచ్చే వారు ఎవరూ లేరు. ఇంత భారీ నష్టం జరిగినా.. నా ఖాతాలో కేవలం రూ.2.30 జమ కావడంతో షాకయ్యాను" అని ఆయన వాపోయారు. పంట దెబ్బతినడంతో పాటు పశువులకు గడ్డి కొరత ఏర్పడిందని, ఇది తమకు మరో సంక్షోభాన్ని తెచ్చిపెట్టిందని పాటిల్ చెప్పారు.
ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో పాల్ఘర్ జిల్లా వ్యవసాయ అధికారి నిలేష్ భాగేశ్వర్ స్పందించారు. ఈ లావాదేవీ కేవలం సాంకేతిక లోపం కారణంగానే జరిగిందని ఆయన వివరించారు. 2023 ఖరీఫ్ సీజన్లో వరి పంట నష్టం కోసం పాటిల్కు మొత్తం రూ.72,466 పంట బీమా పరిహారం రావాల్సి ఉందని అధికారి తెలిపారు. అందులో మే 2024లోనే రూ.72,464 మొత్తం రైతుకు అందిందని.. మిగిలిన రూ.2.30 పైసలు అక్టోబర్ 31న సాంకేతిక లోపం వల్ల ఇప్పుడు జమ అయ్యాయని వివరించారు. తాము రైతును కలిసి పూర్తి సమాచారాన్ని వివరించామని, దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు లేవని లిఖితపూర్వక హామీ కూడా తీసుకుంటామని భాగేశ్వర్ వెల్లడించారు.
అయితే, ఈ సంఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. "పాల్ఘర్ రైతులు పంట బీమా పరిహారంగా కేవలం రెండు రూపాయలు మాత్రమే అందుకోవడం ఒక జోక్" అని ఎద్దేవా చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రాష్ట్ర రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa