ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, పాక్ ఆటగాళ్లపై చర్యలు తీసుకున్న ఐసీసీ,,,,పాక్ పేసర్ హారిస్ రవూఫ్‌ఫై రెండు మ్యాచ్‌ల నిషేధం

sports |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 10:29 PM

ఆసియాకప్ 2025 సందర్భంగా పాకిస్థాన్ ఆటగాళ్లు అతి చేసిన విషయం తెలిసిందే. ఆటతో గెలవలేకపోయిన ఆ జట్టు ఆటగాళ్లు.. వెకిలి చేష్టలతో ఆత్మసంతృప్తి పొందే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్‌ హద్దుమీరి ప్రవర్తించాడు. భారత్, పాక్ యుద్ధంలో తాము భారత్‌కు చెందిన ఫైటర్ జెట్లు కూల్చేసినట్లు సంజ్ఞలు చేశాడు. ఈ విషయాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.


ఆసియాకప్‌ 2025లో భాగంగా భారత్, పాక్ మూడు సార్లు తలపడ్డాయి. ఇందులో లీగ్ స్టేజ్‌లో సెప్టెంబర్ 14న తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్‌, అభిషేక్ శర్మలను రవూఫ్ దుర్భాషలాడాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది. దాంతో పాటు రెండు డిమెరిట్ పాయింట్లు కేటాయించింది.


ఇంత జరిగినా.. హారిస్ రవూఫ్ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. ఫైనల్‌ మ్యాచ్‌లో మరోసారి ఇలాంటి చేష్టలే చేశాడు. ఫీల్డింగ్ చేస్తుండగా భారత అభిమానులు కోహ్లీ కోహ్లీ అని అరవగా.. అందుకు బదులుగా రవూఫ్ భారత్‌కు చెందిన 6 రఫెల్ జెట్ ఫ్లైట్స్‌‌ను కూల్చామని, యుద్దంలో తమదే విజయమని పేర్కొంటూ 6-0 సంజ్ఞలు చేశాడు. దీంతో మరోసారి అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది ఐసీసీ. అదనంగా మరో రెండు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది.


ఐసీసీ రూల్స్ ప్రకారం.. 24 నెలల వ్యవధిలో 4 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పొందితే సదరు ఆటగాడిపై ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధం పడుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతోంది. దీంతో రవూఫ్ రెండు వన్డేలు ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది.


ఇదే సమయంలో మరికొందరు ఆటగాళ్లపై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. గ్రూప్‌ స్టేజ్‌లో పాక్‌పై విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నట్లు చెప్పిన సూర్యకుమార్ యాదవ్‌ మ్యాచ్‌ ఫీజులో 30 శాతం కోత విధించింది. రెండు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. హారిస్‌ రవూప్‌ తరహాలో జెట్ విమానం కూలినట్లగా సైగ చేసిన జస్‌ప్రీత్ బుమ్రాను ఐసీసీ మందలించింది. హాఫ్ సెంచరీ చేశాక గన్‌ పేల్చినట్లు సైగలు చేసిన పాక్ బ్యాటర్ ఫర్హాన్‌ను మందలించింది. ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa