ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెట్‌ఫ్లిక్ష్‌లో వెబ్‌ సిరీస్‌తో ప్రేరణ.. ప్లాన్ చేసి రూ.150 కోట్లు దోచేశారు!

Crime |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 08:36 PM

నెట్‌ఫ్లిక్స్‌లో థ్రిల్లర్ ‘ మనీ హెయిస్ట్ ’ వెబ్ సిరీస్‌తో ప్రేరణ పొందిన ఓ ముఠా.. ప్లాన్ చేసి రూ.150 కోట్లు దోచేసింది. అంతేకాదు, ముఠా సభ్యులు ఆ సిరీస్‌లోని పాత్రల పేర్లనే పెట్టుకోవడం విశేషం. ఆన్‌లైన్‌లో పలువుర్ని మోసం చేసి అదనంగా మరో రూ.23 కోట్లు కాజేశారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడిన ముఠాలోని ముగ్గుర్ని తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అర్పిత్, ప్రభాత్, అబ్బాస్‌లుగా గుర్తించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెబుతూ సోషల్ మీడియాలో మోసాలకు పాల్పడ్డారు. వెబ్ సిరీస్‌తో ప్రేరణ పొందడంతో తమ గుర్తింపును దాచుకోడానికి తప్పుడు స్క్రీన్ షేర్లు (ఆన్‌లైన్ నకిలీ పేర్లు) ఉపయోగించారు.


లాయర్ అయిన అర్పిత్ ‘ప్రొఫెసర్’‌గానూ.. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ చేసిన ప్రభాత్ ‘అమందా’గానూ.. అబ్బాస్ ‘ఫ్రెడ్డీ’గానూ పేర్లు మార్చుకున్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని మోసం చేయడానికి సోషల్ మీడియాలో పలు రహస్య గ్రూప్‌లను సృష్టించారు. డజన్ల కొద్దీ వాట్సాప్, సోషల్ మీడియా గ్రూప్‌ల్లో స్టాక్ మార్కెట్ల గురించి సలహాలు, టిప్స్ ఇస్తూ ఆకర్షించారు. పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించారు.


తొలుత నమ్మకం ఏర్పడటానికి తక్కువ మొత్తంలోమొదట్లో చిన్న లాభాలను బుక్ చేసి ప్రజల నమ్మకాన్ని పొందారు. అయితే, ఎవరైనా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన మరుక్షణమే ఆ ఖాతాను బ్లాక్ చేసేవారు. తమ డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించే వారిని మోసం చేసి, మరిం డిపాజిట్ చేయాలని బెదిరించేవారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా 300 మందికి పైగా వీరిలో మోసపోయారు.


పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ముఠా తరచుగా విలాసవంతమైన హోటళ్లలో నివసిస్తూ, కేవలం మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సహాయంతో మోసాలకు పాల్పడ్డారు. దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, పశ్చిమ్ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు వారి వద్ద నుంచి 11 మొబైల్ ఫోన్లు, 17 సిమ్ కార్డులు, 12 బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు, 32 డెబిట్ కార్డులు, అలాగే ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు, వాట్సాప్ చాట్లు స్వాధీనం చేసుకున్నారు.


ముఠా లావాదేవీలు, కాల్ రికార్డులు, ఇంటర్నెట్ లాగ్స్ విశ్లేషించగా భారత్ వెలుపల వీరి సంబంధాలు ఉన్నట్టు వెల్లడించాయి. పలువురు చైనా అనుమానితులు కూడా ఈ మోసంలో భాగస్వామ్యులైనట్టు తెలుస్తోంది. ఇదే ముఠా ఆన్‌లైన్‌లో మరో రూ.23 కోట్లు కాజేసిందని పోలీసులు తెలిపారు. ఇందులో చైనా నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైబర్ మోసగాళ్ల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఆ గ్యాంగ్‌లోని మిగతా సభ్యులు, వారి విదేశీ నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa