ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకులపై కొత్త పోరాటం,,,కర్ణాటక హైకోర్టులో విజయ్ మాల్యా పిటిషన్

national |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 08:40 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త, పరారీలో ఉన్న విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులపై సరికొత్త న్యాయ పోరాటానికి తెరలేపారు. తన నుంచి, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను నియంత్రించిన యూబీ హోల్డింగ్స్ కంపెనీ నుంచి ఇప్పటికే రికవరీ చేయబడిన రుణాలపై కూడా బ్యాంకులు వడ్డీని వసూలు చేయడం కొనసాగించకూడదని విజయ్ మాల్యా మంగళవారం కర్ణాటక హైకోర్టును అభ్యర్థించారు. అంతేకాకుండా అప్పులు, తిరిగి వసూలు చేసిన మొత్తాలకు సంబంధించిన పూర్తి అకౌంట్ స్టేట్‌మెంట్‌లను బ్యాంకులు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.


విజయ్ మాల్యా తరఫున సీనియర్ లాయర్ సజన్ పూవయ్య కర్ణాటక హైకోర్టులు వాదనలు వినిపించారు. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే సాకుతో.. ఇప్పటికే కోర్టుల ఆదేశాల ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని.. ఫైనల్ రికవరీగా పరిగణించలేమని బ్యాంకులు చేస్తున్న వాదనను మాల్యా తీవ్రంగా ఖండించారు. బ్యాంకులు ఇప్పటికే తమకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేశాయని.. ఆ మొత్తాన్ని వారు ఉపయోగిస్తున్నారు కాబట్టి.. వసూలు చేసిన మొత్తంపై వడ్డీని విధించకూడదని వాదించారు.


రికవరీ లెక్కల్లో తేడాలు


రుణ రికవరీ ట్రిబ్యునల్ జారీ చేసిన రికవరీ సర్టిఫికెట్ ప్రకారం.. రూ.6,203 కోట్ల అప్పులకు 11.5 శాతం వడ్డీతో తిరిగి వసూలు చేయాలి. అయితే.. రికవరీ చేసిన మొత్తాలపై విజయ్ మాల్యా తరఫు లాయర్ పలు గణాంకాలను హైకోర్టు ముందు ఉంచారు. 2021 జూలై 16వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. విజయ్ మాల్యా నుంచి రికవరీ చేసిన మొత్తం సొమ్ము రూ.7,181 కోట్లు అని తెలిపారు. ఇక రికవరీ ప్రక్రియల ప్రకారం అప్పటికే రూ.10,040 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.


ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు విజయ్ మాల్యా నుంచి దాదాపు రూ.14 వేల కోట్లను తిరిగి వసూలు చేసినట్లు స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు తెలియజేశారు. ఈ లెక్కలన్నీ చూస్తుంటే.. తమకు రావాల్సిన దానికంటే బ్యాంకులు ఎక్కువ మొత్తాన్ని వసూలు చేశాయని.. కనీసం పూర్తి అసలు, వడ్డీని పొందే దశలో ఉన్నాయని విజయ్ మాల్యా వాదిస్తున్నారు.


గత నెలలో విజయ్ మాల్యా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. తమకు రావాల్సిన మొత్తాలపై పారదర్శకంగా, కచ్చితమైన అకౌంట్ స్టేట్‌మెంట్‌ను సమర్పించని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు సిగ్గు పడాలి అని విజయ్ మాల్యా తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే.. భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ రికవరీల విషయంలో స్పష్టతనిచ్చే వరకు తాను ఇంగ్లాండ్‌లో చట్టపరమైన చర్యలను కొనసాగించబోనని.. తన కౌంటర్ క్లెయిమ్‌లను భారతదేశంలో మాత్రమే విచారించవచ్చని విజయ్ మాల్యా స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa