ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో వాణిజ్య చర్చలు సానుకూలంగా ఉన్నాయని వెల్లడి

international |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 07:27 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత పర్యటనకు రానున్నట్లు సంకేతాలిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీని 'గొప్ప వ్యక్తి' అని, 'తన మిత్రుడు' అని అభివర్ణించారు. భారత్‌తో వాణిజ్య చర్చలు సానుకూలంగా ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు.గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత పర్యటనకు సంబంధించిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఆయన మోదీ నా మిత్రుడు. మేమిద్దరం మాట్లాడుకుంటాం. నేను భారత్‌కు రావాలని ఆయన కోరుకుంటున్నారు. దాని గురించి మేం ఆలోచిస్తాం. నేను తప్పకుండా వెళ్తాను. ఆయన గొప్ప వ్యక్తి అని అన్నారు. వచ్చే ఏడాది పర్యటన ఉంటుందా అని అడగ్గా అవును ఉండొచ్చు అని బదులిచ్చారు. 2020లో తన భారత పర్యటనను గుర్తుచేసుకుంటూ అది ఒక అద్భుతమైన పర్యటన అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి కొద్ది రోజుల ముందే వైట్‌హౌస్ కూడా భారత్-అమెరికా సంబంధాలపై స్పందించింది. ట్రంప్‌కు ప్రధాని మోదీపై ఎంతో గౌరవం ఉందని, వారిద్దరూ తరచుగా మాట్లాడుకుంటారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మంగళవారం తెలిపారు. వాణిజ్య చర్చల గురించి మాట్లాడుతూ, ట్రంప్ బృందం భారత అధికారులతో తీవ్రమైన చర్చలు జరుపుతోందని ఆమె వెల్లడించారు.ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలకు నిదర్శనంగా ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకలను, సెర్గియో గోర్‌ను తదుపరి రాయబారిగా నియమించడాన్ని లెవిట్ ప్రస్తావించారు. అక్టోబర్ 21న జరిగిన దీపావళి కార్యక్రమంలో కూడా ట్రంప్ మాట్లాడుతూ, మోదీ ఒక గొప్ప వ్యక్తి అని, భారత ప్రజలంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు.ఇదే సమయంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను చాలా వరకు నిలిపివేసిందని ట్రంప్ తన తాజా మీడియా సమావేశంలో పేర్కొనడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa