శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వైకుంఠ ద్వార దర్శనం తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన 'డయల్ యువర్ ఈవో' కార్యక్రమంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. దర్శనానికి సంబంధించిన ఆన్లైన్, ఆఫ్లైన్ టోకెన్ల జారీ విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.భక్తుల సౌకర్యార్థం అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలోనూ కీలక మార్పు చేసినట్లు ఈవో ప్రకటించారు. ఇప్పటివరకు అమలులో ఉన్న డిప్ విధానాన్ని రద్దు చేసి, 'ముందు వచ్చిన వారికి ముందు' ప్రాతిపదికన టోకెన్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ ద్వారా అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు.భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్ల జారీ విధానాన్ని సమీక్షించేందుకు టీటీడీ బోర్డు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa