15 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు మిస్టరీని ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. భార్యను హత్య చేసి, అది ఆత్మహత్యగా చిత్రీకరించి పరారైన భర్తను గుజరాత్లో అరెస్ట్ చేశారు. నిందితుడు నరోత్తమ్ ప్రసాద్ను ఢిల్లీకి తరలించి, తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.వివరాల్లోకి వెళితే... 2010 మే 31న ఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలోని ఒక ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా, 25 ఏళ్ల మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో నేలపై పడి ఉంది. సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది.అయితే, విచారణ ప్రారంభించిన పోలీసులకు మృతురాలి భర్త నరోత్తమ్ ప్రసాద్పై అనుమానం కలిగింది. అప్పటికే అతను పరారీలో ఉండటంతో అనుమానం బలపడింది. దీంతో పోలీసులు అతడిని నిందితుడిగా ప్రకటించి, అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10,000 రివార్డు కూడా ప్రకటించారు. కానీ, ఇన్నేళ్లుగా అతడి జాడ తెలియలేదు.ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులకు ఇటీవల ఓ కీలక సమాచారం అందింది. నిందితుడు గుజరాత్లోని వడోదరలో ఉన్నట్టు తెలియడంతో, మంగళవారం ఓ ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. టెక్నికల్ నిఘా, స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో పోలీసులు బుధవారం వడోదరలోని ఛోటా ఉదయ్పూర్ ప్రాంతంలో నరోత్తమ్ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లోని సికర్కు చెందిన నరోత్తమ్, ఇన్నేళ్లుగా ఛోటా ఉదయ్పూర్లోని ఓ కాటన్ ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేస్తూ అజ్ఞాతంలో గడుపుతున్నాడు.పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. పెళ్లైన కొన్నాళ్లకే తమ మధ్య గొడవలు పెరిగాయని, తీవ్రమైన ఆవేశంలో భార్యను హత్య చేశానని తెలిపాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే నకిలీ సూసైడ్ నోట్ రాసి అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa