మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు భావితరాల భవిష్యత్ కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం రీజనల్ కో-ఆర్డినేటర్ హేమంత్ రెడ్డి తెలిపారు. చిత్తూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు డీసీ మనోజ్ అధ్యక్షతన శుక్రవారం చిత్తూరు నగరంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హేమంత్ రెడ్డి, డీసీ మనోజ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంతో పాటు, పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు వైయస్ జగన్ పాలనలో రూ.8 వేల కోట్లతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. వైయస్ఆర్సీపీ హయాంలోనే ఏడు మెడికల్ కళాశాలల పూర్తి చేసి ఐదింట్లో తరగతులు ప్రారంభించారని, మిగిలిన కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 10 మెడికల్ కళాశాలలను తన వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని చెప్పారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదని,ప్రజాధనాన్ని పీల్చిపిప్పి చేసి పిండుకోవడమే అనేది చంద్రబాబు విధానమని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు పెద్ద ఎత్తున నష్టపోతారన్నారు. ప్రభుత్వ మెడలు వంచేందుకు వామపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం గుడిపాల మండల అధ్యక్షుడు స్టాండ్లీ, రూరల్ మండల అధ్యక్షుడు విజయ్, జిల్లా నాయకులు శబరీష్, సద్దాం, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa