కేరళలోని కొట్టాయం జిల్లాలో మూఢనమ్మకాలు ఒక యువతి జీవితాన్ని ఛిద్రం చేశాయి. ఒక మంత్రగాడితో కలిసి అత్తింటి కుటుంబ సభ్యులు తమ కోడలికి దెయ్యం పట్టిందనే నెపంతో అత్యంత దారుణంగా హింసించారు. బలవంతంగా మద్యం, బీడీలు తాగించడం.. శారీరక, మానసిక దౌర్జన్యానికి పాల్పడటం వంటి అమానుష చర్యలకు పాల్పడ్డారు.
అసలేం జరిగిందంటే..?
26 ఏళ్ల వయసు కల్గిన బాధితురాలు.. అఖిల్ దాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి అత్తింటి వద్దే ఉంటూ భర్తతో కాపురం చేస్తోంది. అయితే ఇటీవలే అఖిల్ దాస్ బంధువుల్లో ఒకరు మరణించారు. అయితే ఆ చనిపోయిన వారి ఆత్మ కోడలు శరీరంలో ప్రవేశించిందని అఖిల్ తల్లి ఆరోపించింది. దీంతో నవంబర్ 2వ తేదీన 54 ఏళ్ల మంత్రగాడు శివదాస్ను ఇంటికి రప్పించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పది గంటల పాటు పూజలు చేయించారు. యువతికి ఒంట్లో దెయ్యం ఉందని.. దాన్ని వెళ్లగొట్టే నెపంతో నరకం చూపించారు.
ముఖ్యంగా ఆమె వద్దని వేడుకుంటున్న వినకుండా ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఆపై బీడీ కూడా కాల్చేలా చేశారు. ఆపై ఆ బూడిదను కూడా ఆమెచేత తినిపించారు. ఈ క్షుద్రపూజల సమయంలో ఆమెను తీవ్రంగా హింసించారు. శరీరంపై వాతలు పెట్టారు. కొన్ని గంటల పాటు శారీరకంగా, మానసికంగా వేధించారు. నిరంతర హింస, దురాచారాల కారణంగా ఆ మహిళ పూర్తిగా స్పృహతప్పి పడిపోయింది. ఆమె మానసిక ఆరోగ్యం కూడా తీవ్రంగా క్షీణించింది. విషయం తెలుసుకున్న ఆ మహిళ తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. తీవ్ర ఒత్తిడిలో ఉన్న బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.
పోలీస్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో మంత్రగాడు శివదాస్, బాధితురాలి భర్త అఖిల్ దాస్, అతని తండ్రి దాస్ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ అమానుష ఘటనకు ప్రధాన కారకురాలైన అఖిల్ తల్లి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమెను త్వరగా అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు బాధితురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెను అంతంగా హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa